దీదీకి దాదా టెన్షన్.. మోదీ ర్యాలీకి గంగూలీ..?
I have no idea about it, nor has there been any discussion in the meeting: BJP West Bengal chief Dilip Ghosh when asked whether former cricketer Sourav Ganguly will be joining BJP during PM Modi's March 7 rally at Brigade Ground in West Bengal (02-03-2021) pic.twitter.com/meZGd9CImK
— ANI (@ANI) March 3, 2021
వెస్ట్ బెంగాల్ రాజకీయం మరింత హీటెక్కుతుంది. ఇప్పటికే అధికార పార్టీ టీఎంసీకి ధీటుగా బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తుంది. కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు బెంగాల్లో పర్యటిస్తూ బీజేపీకి బూస్టింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, స్మృతి ఇరానీ, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సుడిగాలి పర్యటనలు చేపడుతున్నారు. ఇక మార్చి 7వ తేదీన ప్రధాని మోదీ కూడా పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కాగా, ఇప్పటికే టీఎంసీ కీలక నేతలంతా పార్టీ వీడుతూ.. బీజేపీ గూటికి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని మోదీ కూడా ప్రత్యేక దృష్టిపెట్టారు. మొత్తం 20 ర్యాలీలలో ప్రధాన మోదీ ప్రసంగించనున్నారు. అయితే మార్చి 7వ తేదీన కోల్కతాలో బ్రిగేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సమావేశంలో గంగూలీ కూడా హాజరవుతారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమావేశంలోనే మోదీ చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం.
అయితే గంగూలీ బీజేపీలో చేరుతున్నారా..? అన్న విషయంపై బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ స్పందించారు. గంగూలీ బీజేపీలో చేరుతున్నారన్న వార్తలపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అంతేకాదు.. గంగూలీతో ఎలాంటి సమావేశాలు కూడా జరగలేదని స్పష్టం చేశారు. కాగా, గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రి తనయుడు జై షాతో గంగూలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జై షా బీసీసీఐకి కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా దుర్గాపూజల సమయంలో గంగూలీ భార్య కోల్కతాలో బీజేపీ మహిళా మోర్చ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని నృత్యం కూడా చేశారు. అయితే వీటన్నింటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు గంగూలీ బీజేపీ గూటికి చేరితే టీఎంసీకి ఓటమి ఖాయమని చెబుతున్నారు.