ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పింఛన్లు గుది బండ గా మారాయి. వృద్ధులు వికలాంగులు వితంతువులకు చాలా కాలం నుంచి పింఛన్ అందిస్తున్నారు. మొదట్లో 200, 500 ఉండే ఈ పింఛను తర్వాత కాలంలో పెరుగుతూ వచ్చింది. మొన్నటి ఎన్నికల హామీల్లో భాగంగా 4 వేల చొప్పున పెన్షన్లు ఇచ్చేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అంగీకరించింది. ఇందుకు తగినట్లుగా జూలై నెల మొదటి వారంలోని ప్రతి ఒక్కరికి పింఛన్ చెల్లించారు.
మొన్నటి ఎన్నికల హామీల్లో ఏప్రిల్ నెల నుంచి పెంపు అమలు అవుతుందని తెలియజేశారు. అందుచేత ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన అదనపు మొత్తం 3000 మరియు జూలై నెల పింఛన్ 4000 కలిపి మొత్తంగా 7వేల రూపాయలు అందజేశారు. వచ్చి నెల నుంచి ప్రతినెల క్రమం తప్పకుండా 4000 చొప్పున చెల్లిస్తాము అని మాట ఇచ్చారు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ ప్రభుత్వ బడ్జెట్లో ఎక్కువ భాగం ఈ పింఛన్లు ఇతర సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. దీంతో ఈ ఖర్చు తగ్గించుకునే మార్గాలను ప్రభుత్వం వెతుకుతోంది. అసలు ఈ పింఛన్లు తీసుకుంటున్న వారంతా అసలైన లబ్ధిదారులేనా అని అధ్యయనం చేస్తున్నారు. ప్రాథమికంగా ఏపీలో ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పింఛన్లు ఉన్నాయని ఐఏఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. పింఛన్లలో అక్రమాలపై విచారణకు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఆధార్లో వయస్సు మార్చుకుని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు. దివ్యాంగులు కాకపోయినా.. దివ్యాంగుల ఫేక్ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు తెలిపారు. ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకుంటున్నారని.. ఇది సరైన పద్ధతి కాదంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా అనేక రకాలుగా అక్రమాలు జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఇక బాధ్యులైన అధికారులను కూటమి సర్కారు గుర్తిస్తోంది.
పింఛన్లలో అవకతవకలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మండల స్థాయి అధికారులు కూడా సస్పెండ్ అయ్యే అవకాశాలు కనిపిసున్నాయి.
మొత్తం మీద సమగ్ర అధ్యయనం తర్వాత చాలావరకు పింఛన్లలో కోతపడుతాయి అని అంటున్నారు. తద్వారా ఖర్చుని తగ్గించుకోవచ్చు అని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.