కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండడంతో కర్ఫ్యూ విధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉంటుందంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే రాత్రి 9 గంటలనుంచి
ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగనుంది.
అయితే ఈ కర్ఫ్యూ పరిధిలోకి ఏమేం వస్తాయి…. కర్ఫ్యూనుంచి వేటికి మినహాయింపు ఉంటుందో చూద్దాం.
జనం కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి లేదు. దుకాణాలు, రెస్టారెంట్లు, బార్లు, పబ్ లు , క్లబ్ లకు రాత్రి 8 గంటల వరకే అనుమతి
ఇక మీడియా, టెలీకమ్యునికేషన్, ఇంటర్నెట్ సేవలు , అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుంది. అలాగే…
ఆస్పత్రులు, డయోగ్నస్టిక్, మెడికల్ షాపులు, ల్యాబ్స్కు అనుమతి ఉంటుంది. పెట్రోల్ బంకులకూ మినహాయింపునిచ్చారు. కోల్డ్ స్టోరోజీలు, గోడౌన్లు యథాతథంగా పనిచేస్తాయి.
ఐటీతో పాటు ఐటీ అనుబంధ సేవలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. నిత్యావసర వస్తువులు, మెడిసిన్ రవాణా కొనసాగుతాయి. ఈ కామర్స్ యాప్స్ ద్వారా జరిగే ఆహార పదార్థాల పంపిణీకి, నీటి సరఫరా, పారిశుధ్యం పనులకు , ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులకు మినహాయింపు ఉంటుంది. ప్రభుత్వధికారులు రాకపోకలు కొనసాగించవచ్చు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలు, సరకు రవాణా వాహనాలు, ఎయిర్పోర్టులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల నుంచి ఇళ్లకు చేరుకునే ప్రయాణికులకు మినహాయింపు ఉంటుంది. వైద్యంకోసం వెళ్లే గర్భిణులు, రోగులకు కూడా కర్ఫ్యూ నిబంధన వర్తించదు. ఇక బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సేవలకు మినహాయింపు ఉంటుందని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది.