ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి మళ్లీ వణికిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ఇటలీ సర్కార్ అలర్ట్ అయ్యింది. దాదాపు నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా షట్ డౌన్ చేసేందుకు రెడీ అయ్యింది. కరోనా వైరస్కు బ్రేకులు వేయాలంటే కఠినమైన ఆంక్షలు అమలు చేయాల్సిందేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో సోమవారం నుంచి దుకాణాలు, రెస్టారెంట్లు, స్కూళ్లు మూసివేయనున్నారు. ఏప్రిల్లో జరిగే ఈస్టర్ వేడుకల వరకు ఈ ఆంక్షలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆరంభంలోనే లాక్డౌన్ కఠినంగా అమలు చేసినప్పటికీ.. మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటలీ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కాగా, ఇటలీలో కరోనా మహమ్మారి కారణంగా లక్ష మందికి పైగా మరణించారు. బ్రిటన్ తర్వాత యూరప్ దేశాల్లో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో ఇటలీ ద్వితీయ స్థానంలో ఉంది.