*కరోనా ఎఫెక్ట్.. ప్రపంచ దేశాల చూపంతా భారత్ వైపే..!’
కరోనా మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లకు డిమాండ్ పెరుగుతుండటమే అందుకు నిదర్శనమన్నారు. ఈ డిమాండ్ను భారత్ అధిగమించాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. కరోనా తరహాలోనే భవిష్యత్తులో పలు సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా ప్రపంచం రెడీగా ఉండాలన్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించి బడ్జెట్లో చేపట్టిన చర్యల అమలుపై మోదీ ఓ వెబినార్లో ప్రసంగించారు. కరోనా అనంతరం ఆరోగ్య రంగంలో భారత సామర్ధ్యం పట్ల ప్రపంచ దేశాలు విశ్వాసాన్ని పెంచుకున్నాయన్నారు.
ఆరోగ్య రంగానికి అసాధారణంగా బడ్జెట్ కేటాయింపులుండటం మన నిబద్ధతకు నిదర్శనమని.. రాబోయే రోజుల్లో కరోనా వంటి సవాళ్లను ఎదుర్కొనేలా మనకు ఈ కరోనా ఓ గుణపాఠం నేర్పిందన్నారు. వైద్య పరికరాల నుంచి మొదలు.. మందులు, వెంటిలేటర్ల వరకు అన్నింటిని సమకూర్చుకుని.. ఆ తర్వాత వ్యాక్సిన్ను కూడా తయారుచేసి ప్రపంచానికి విశ్వగురువుగా అవతరించిందన్నారు.