కర్నాటకలో సంస్కృత యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున భూమి, నిధులు కేటాయించడంపై దుమారం రేగుతోంది. మగడిలో విశ్వవిద్యాలయ క్యాంపస్ నిర్మాణానికి 324 కోట్లు నిధులు కేటాయిస్తూ బస్వరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 3న ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నిర్మాణపనులకు శంకుస్థాపన చేశారు. అయితే ప్రభుత్వ విధానాన్ని తప్పుబడుతూ మొదట నిరసనగళం వినిపించింది కాంగ్రెస్ పార్టీ. సంస్కృత యూనివర్సిటీ నెలకొల్పడం అంటే బ్రాహ్మణికల్ భావజాలాన్ని ప్రజలపై రుద్దడమేనని మండిపడ్డారు కాంగ్రెస్ స్పోక్ పర్సన్ ఏఎన్ నటరాజ గౌడ. వెంటనే ఇస్లామిస్టులు గొంతెత్తారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్మీడియాలో పెద్ద ఉద్యమమే లేవనెత్తింది కాంగ్రెస్ పార్టీ. ట్విట్టర్లో ‘SayNoto Sanskrit’ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో నడిచింది.
దాంతో పాటు #StopHindiImposition హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో కనిపించింది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, ఇతర ఇస్లామిక్ ఆర్గనైజేషన్ సభ్యులు కూడా ఈ ట్రెండ్లో పాలుపంచుకున్నారు. పీఎఫ్ఐ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు యాసిర్ హసన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎలాంటి విదేశీ భాషలను సహించబోమని సంస్కృతం, హిందీ ప్రయోగ చర్యల్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తున్న వారిలో కన్నడ భాషాసంఘాల్నీ చేరిపోయాయి. తమ భాషను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ కన్నడభాషాసంఘాలు, భాషాభిమానుల ఆందోళనలకు దిగుతున్నారు. ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామని హెచ్చరించాయి. అయితే బొమ్మై ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. సంస్కృతానికి ప్రాధాన్యత ఇవ్వడం అంటే కన్నడను తక్కువచేయడం, విస్మరించడం అస్సలే కాదని..ఈ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు సీఎం.
హంపిలోని కన్నడ విశ్వవిద్యాలయ ఉద్యోగులకు జీతాలు, ఫెలోషిప్లు చెల్లించేందుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం.. సంస్కృత భాషకు పెద్దఎత్తున నిధులు కేటాయించడమేంటని విపక్షాలు అంటున్నాయి. హిందీని, సంస్కృతాన్ని కన్నడ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఇస్లామిస్టులు మండిపడుతుంటే …ఆరోపణల్ని ఖండిస్తూ ఎదురుదాడికి దిగుతోంది అధికార బీజేపీ. భారతీయ భాషలన్నింటికీ మూలం సంస్కృతమేనని… కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కావాలనే ప్రజల్ని రెచ్చగొడుతూ ఆందోళనలు చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రపంచంలోనే ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులందరిదీ వారంటున్నారు.
బెంగళూరు నిర్మాత కెంపె గౌడ రాజు జన్మస్థలం మగడి. ఆ ప్రాంతానికి ఎంతో చారిత్రకనేపథ్యం ఉంది. నగరం సమీపంలోని సవనదుర్గలోని రంగనాథస్వామి దేవాలయం, కాలభైరవేశ్వరాలయం సహా పలు ప్రసిద్ధ దేవాలయాలున్నాయి. పదేళ్లుగా బెంగళూరులో సంస్కృత విశ్వవిద్యాలయం ఉన్నా ప్రత్యేకంగా సొంత క్యాంపస్ లేదు. తాజాగా భూమి, నిధుల కేటాయింపుతో రగడ మొదలైంది.