ఆప్ మాజీ నాయకుడు ఆశుతోష్ కు ఇంటర్వ్యూ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాంరమేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పార్టీ చేసిన చారిత్రక తప్పుల గురించి ప్రస్తావిస్తూ…తాము తప్పులు చేయలేదని అనలేమని… షాబోనో కేసు అలాగే 1986లో బాబ్రీ తాళాలు తెరవడం మేం చేసిన అతిపెద్ద తప్పులు అని ఆయన అన్నారు. అందుకు ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తున్నామనీ జైరాం అన్నారు. 1949నుంచి ఉన్న బాబ్రీ కట్టడం తాళాలను 1986లో రాజీవ్ గాంధీ హయాంలో తెరిచిన సంగతి తెలిసిందే. మైనార్టీల సంతుష్టీకరణ ముఖ్యంగా ముస్లింలపట్ల బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పట్ల అభిప్రాయం బలపడిపోతున్న సందర్భంలో హిందూసమాజాన్ని తమవైపు తిప్పుకునేందుకు ఈ చర్యకు సిద్ధమైందని చెప్పవచ్చు.
అయితే జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై హిందూసంస్థలు మండిపడుతున్నాయి. న్యాయపోరాటంలో గెలిచి ఇప్పుడు అక్కడ అద్భుతమైన రామమందిరాన్ని నిర్మించుకుంటున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు తమ అక్కసును, హిందూ వ్యతిరేకతను బయటపెట్టుకుంటున్నారని బీజేపీ సైతం మండిపడుతోంది. బాబ్రీ మసీదునుతెరవడాన్ని తమ పార్టీ చేసినతప్పుగా పేర్కొనడం అంటే మరింకెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు పలువురు.జైరాం వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ పనిని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. 2007లో, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో, “వాల్మీకి రామాయణం, రామచరిత్రలు ప్రాచీన భారతీయ సాహిత్యంలో భాగం మాత్రమేనని..ఆ పాత్రలు నిజంగా ఉన్నట్టు…ఘటనలు జరిగినట్టు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.
రామసేతును దెబ్బతీసే విధంగా సేతుసముద్రం ప్రాజెక్టును రద్దు చేయాలనే డిమాండ్పై యూపీఏ ప్రభుత్వం ఈ వాదన వినిపించింది. అంతేకాదు అయోధ్యలో రామజన్మభూమిలో మందిర నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సున్నీ వక్ఫ్ బోర్డ్ తరపున కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినింపించారు. రామజన్మభూమి కేసులో నిర్ణయాన్ని 2019 ఎన్నికల వరకు వాయిదా వేయాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఇక మంచి హిందువు అనేవాడెవడూ బాబ్రీ కట్టడం స్థలంలో మందిరాన్ని కోరుకోరని మరో సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. అక్కడమందిరం కట్టాలనుకోవడం ఎందుకు అంతైతే గుండెల్లో పెట్టుకోండి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత కుమార్ కేత్కర్ శ్రీరాముడు అనే వాడే చరిత్రలో లేడని…అతను హిందూ దేవుడన్నది సాహిత్య సృష్టి అని ప్రచారం చేశాడు.
వాల్మీకి అనే కవి రామాయణం రాశాడని..దాని ప్రభావం భారత్ సహా పలు దేశాల్లో కనిపించింది తప్ప ఆయన చరిత్రలో ఉండేవాడన్నది నిజం కాకపోవచ్చని వ్యాఖ్యానించారు.