దేశంలో పలుచోట్ల వరుస ఉగ్రదాడులకు పథక రచన చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పీఎఫ్ఐకి చెందిన ఇద్దర్ని ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరూ కేరళ వాసులని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దాడుల కోసం వివిధ రాష్ట్రాల్లో సభ్యులను రిక్రూట్ చేసుకుంటున్నట్టు ప్రాథమిక విచారణలో నిర్థారణ అయిందని యూపీ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ కుమార్ తెలిపారు.
అరెస్టు చేసిన వారి దగ్గర్నించి…బ్యాటరీ, రెడ్ వైర్, .32 బోర్ పిస్టల్, ఏడు లైవ్ కాట్రిడ్జ్లు, నగదు, పాన్ కార్డ్, నాలుగు ఏటీఎం కార్డులు, పెన్ డ్రైవ్లు, మెట్రో కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్ కార్డులు సహా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు దుండగులని అన్సాద్ బద్రుద్దీన్ , ఫిరోజ్ ఖాన్ గా గుర్తించారు.
అక్కడి గుడంబా ప్రాంతంలోని కుక్రైల్ ట్రైసెక్షన్ నుంచి వారిని అదుపులోకి తీసుకున్నారు. వసంత పంచమి లక్ష్యంగా…. దేశంలో పలుప్రాంతాల్లో విధ్వంసానికి వారు కుట్ర పన్నారు. అందుకోసం పెద్దఎత్తున మారణాయుధాలు, పేలుడు పదార్థాలు సేకరించారు. వాటిని సున్నితప్రాంతాలు, ముఖ్యంగా హిందువుల ఆధ్యాత్మిక కేంద్రాల్లో పెట్టేట్టు ఆయా రాష్ట్రాల్లో సభ్యులను రిక్రూట్ చేసుకునే ప్రక్రియను గుడంబాలో మొదలుపెట్టినట్టు పోలీసులకు సమాచారం అందడంతో వలపన్ని పట్టుకున్నారు.
ఓ వర్గానికి చెందిన బలిష్టమైన యువకులను ఎంపిక చేసుకుని వారికి బ్రెయిన్ వాష్ చేసి విధ్వంసకాండల్లో వారిని భాగస్వామ్యం చేయడం వారి లక్ష్యంగా తేలింది. అలాంటివాళ్లని రిక్రూట్ చేసి రహస్య ప్రాంతాల్లో శిక్షణ ఇస్తామని నిందితులు విచారణలో ఒప్పుకున్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ యుద్ధం ప్రకటించింది కొంతకాలంగా పీఎఫ్ఐ. వారిపై లక్నోలో ఎస్టీఎఫ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో దేశవ్యాప్తంగా పౌరసత్వసవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు పీఎఫ్ఐ నిధులు సమకూర్చింది. నాటి నుంచి మరింత యాక్టివ్ అయిన ఈ సంస్థ పెద్దఎత్తున పేలుడు పదార్థాలు, మారణాయుధాలు సమకూర్చుకుంటూ.. రిక్రూట్మెంట్లు చేస్తూ ఇలా దొరికిపోయింది.