ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖులకు ఉగ్ర ముప్పు ఉందని నిఘా వర్గాలకు సమాచారం అందింది. రిపబ్లిక్ డే కు కుట్ర చేస్తున్న ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ కనిపెట్టింది. అందుకు సంబంధించి తొమ్మిది పేజీల నివేదికను ప్రభుత్వానికి అందచేసినట్టు సమాచారం. జనవరి 26న గణతంత్ర దినోత్సవాలకు హాజరయ్యే మోదీ ఇతర ప్రముఖుల ప్రాణాలకు ముప్పు ఉందని నివేదికలో అధికారులు వెల్లడించారు. ఈసారి గణతంత్ర వేడుకలకు దక్షిణాసియా దేశాలైన కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రగ్రూపులు దేశంలోని కీలక వ్యక్తులను టార్గెట్ చేసుకుని…బహిరంగ సభలు, సమావేశాలు, రద్దీగా ఉండే ప్రదేశాలను కేంద్రంగా చేసుకుంటున్నట్టు సమాచారం. లష్కరే తోయిబా, ది రెసిస్టెన్స్ ఫోర్స్, జైషే మహ్మద్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రరిస్టు గ్రూపులు పెద్ద ఎత్తున కుట్రకు పథక రచన చేస్తున్నట్టు అత్యున్నతస్థాయి సమాచారం హెచ్చరిస్తోంది.
ఈసారి ఖలిస్తాన్ గ్రూపులు దేశంలో విధ్వంసానికి కుట్ర పన్నుతున్నట్టు తెలిసింది. గతేడాది రైతు ఆందోళనల సందర్భంగా ఎర్రకోట దగ్గర ఏం జరిగిందో అందరికీ తెలుసు. పాకిస్తాన్లో ఉన్న ఖలిస్తానీ గ్రూపులు పంజాబ్లో మిలిటెన్సీని మొబిలైజ్ చేయడం, కేడర్లను కూడా సమీకరించుకుంటున్నాయని నిఘావర్గాలకు పక్కా సమాచారం ఉంది. అక్కడ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ సహా ఇతర రాష్ట్రాల్లోనూ దాడులకు కుట్ర చేస్తున్నట్టు నివేదికలో ఇంటెలిజెన్స్ పేర్కొ న్నట్టు సమాచారం.