హిమాచల్లో అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు ఓటర్లు. రెండుసార్లు ఏ పార్టీని గెలిపించని ప్రజలు ఆ సంప్రదాయాన్నే కొనసాగిస్తూ అధికార బీజేపీని దింపేశారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టంకట్టారు. 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో 39 స్థానాల్లో గెలుపుద్వారా స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టారు ఓటర్లు. బీజేపీ 26 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. మోదీ చరిష్మా ఇక్కడ పెద్దగా పనిచేయకపోవడానికి కారణం పార్టీ పకడ్బందీ వ్యూహాలు కూడా. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. దేశ సగటు కంటే ఎక్కువ నిరుద్యోగుల శాతం హిమాచల్లో ఉంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం రాష్ట్రంనుంచి పెద్దఎత్తున వలసలు వెళ్లిన, వెళ్తున్న పరిస్థితి ఇక్కడ. దీంతో వారిని ప్రత్యేకంగా ఫోకస్ చేసింది కాంగ్రెస్. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. ఇక ఆపిల్ తోటలు సైతం బీజేపీ ఓటమికి, గెలుపునకు కేంద్రంగా నిలిచాయని చెప్పవచ్చు. పన్నుపెంపుపై ఆపిల్ రైతులు ఆందోళనలు కొనసాగించారు. దీంతో వాళ్లకు స్పష్టమైన హామీఇచ్చింది కాంగ్రెస్. పాత పెన్షన్ విధానాన్ని అమలుచేస్తామన్న హామీ కూడా ఆ పార్టీకి కలిసొచ్చింది.