మొన్న తెలంగాణ హైకోర్టు నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం..
హైడ్రా కూల్చివేతల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చివాట్లు వేసినట్లు తెలుస్తోంది. శని ఆదివారాల్లో అడ్డగోలుగా నివాసాలను కూల్చివేయడం మీద హైకోర్టు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్ట విరుద్ధంగా పనులు చేయడం సమంజసం కాదని సూటిగా తేల్చి చెప్పింది. ఇప్పటికే తెలంగాణ సమాజంలో హైడ్రా కూల్చివేత మీద నిరసనలు పెరుగుతున్నాయి.
తాజాగా కాంగ్రెస్ అధిష్టానం కూడా హైడ్రా కూల్చివేతల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ లో బిజెపి ప్రభుత్వం సాగిస్తున్న బుల్డోజర్ కూల్చివేతల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఒకవైపు అక్కడ పోరాటం చేస్తూ మరోవైపు ఇక్కడ కుల్చివేతలకు దిగడం పార్టీకి సరిగా ఉండదు అని హై కమాండ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా నిరుపేదల ఇళ్లను అర్థాంతరంగా కూల్చివేయడం మీద ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో కాంగ్రెస్ ప్రతినిధులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
‘త్వరలోనే ఇతర రాష్ర్టాల్లో ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ మాదిరిగా కూల్చివేస్తదంటూ అక్కడి ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. వెంటనే హైడ్రాను, కూల్చివేతల్ని ఆపేయండి’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించినట్టు తెలిసింది.
పార్టీ సీనియర్ల సలహాలు తీసుకోకుండా ఒంటెద్దు పోకడగా వెళ్ళడంపై మందలించినట్లు చెబుతున్నారు.
ఈ విషయంలో కాంగ్రెస్ హై కమాండ్ నేరుగా రంగంలోకి దిగింది. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడమని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ కు రాహుల్ ఫోన్ చేసి సూచించడంతో ఆయన వెంటనే ముఖ్యమంత్రిని పిలిపించి హెచ్చరికలు చేశారు. రేవంత్ తీరు పట్ల ఇప్పటికే అధిష్టానానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. తమను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సీనియర్లను గౌరవించడం లేదని మొరపెట్టుకున్నారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత మొదలైనట్లు వివరించారు.
“నీవు చేసే పనులతో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతుంది. నీ స్వలాభం కాస్త పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటే నీ ఒక్కడిది కాదు. నీవు చేసే పనులతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది” అంటూ వేణుగోపాల్ సున్నితంగా మందలించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
హైడ్రా విషయంలో అధిష్టానం వైఖరిని వేణుగోపాల్ స్పష్టంగా తెలియజేసినట్లు తెలుస్తోంది.
హైకమాండ్ ఆదేశాలు భేఖాతారు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారు. ఒక్కరిద్దరు చేష్టల వలన పార్టీ పరువు పోతుందని పేర్కొంటూ ముఖ్యమంత్రి అయినా.. కార్యకర్త అయిన పార్టీ పెద్దల ఆదేశాలు అనుసరిస్తూ ముందుకు పోవాలి అంటూ స్పష్టం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా దీని పట్ల నిరసన వ్యక్తం అవుతోంది. పేదల ఇండ్లను హైడ్రా బుల్డోజర్లతో తొక్కిస్తున్న రేవంత్రెడ్డిపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులు శాపనార్థాలు పెడుతుంటే చివరికి సొంత పార్టీ అధిష్ఠానం, మంత్రులు సైతం రేవంత్ చర్యల్ని సమర్థించడం లేదు.
ఇప్పటికే ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహంగా ఉంటే, ఇప్పుడు ఈ కూల్చివేతలతో పార్టీ, ప్రభుత్వం ఏం కావాలని సొంత మంత్రులే ముఖ్యమంత్రిని నిలదీసినట్టు తెలిసింది.
మొత్తం మీద హైడ్రా వ్యవహారంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు కన్నా నష్టమే ఎక్కువ జరిగినట్లు సమాచారం.