అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎడాపెడా హామీలు ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా పక్కకు తప్పుకునే పనిలో పడింది. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు ఇస్తున్నామంటూ డిక్లరేషన్ కార్డులు ముద్రించి ఇంటింటికి పంపించారు. ఈ హామీలకు తమదే భరోసా అంటు కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకొన్నారు . ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత … ఈ హామీల అమలు చాలా కష్టం అన్న సంగతి అర్థమైంది. ఈ లోగా పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎటూ తేల్చకుండా ముందుకు లాక్కొచ్చారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు కూడా ముగిసిపోవడంతో హామీల నుంచి కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా తప్పుకొంటోంది.
వరికి బోనస్ మీద కాంగ్రెస్ అసలు రంగు బయట పడిపోయింది. నిజానికి..వరికి బోనస్.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంట్లోని ఓ హామీ. అయితే వడ్లు పండించేవారికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతులు కూడా నమ్మారు. అప్పట్లో వరి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తామంటోంది. దీంతో రైతులు మండి పడుతున్నారు.
నిజం చెప్పాలంటే.. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి లో సన్న వడ్లు పెద్దగా పండించరు. ఎందుకంటే ఎండ వేడిమి కి బియ్యం విరుగుతాయి కాబట్టి సన్న రకం వేయరు. ఎక్కడన్నా వేసినా అది అరుదు మాత్రమే. అటువంటప్పుడు లేని సన్న వడ్లకి ఇంక బోనస్ ఎలా ఇస్తారు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా .. ఈ సన్నాలకు బోనస్ విషయంలో ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోంది. కేవలం కొన్ని రకాలకు మాత్రమే ఈ బోనస్ ఇవ్వనున్నారు. అది కూడా ప్రస్తుత యాసంగి సీజన్ కు వర్తించదు. వచ్చే ఖరీఫ్ నుంచి మాత్రమే ఈ బోనస్ వర్తించనున్నది.
ఇప్పటికే రైతులు కొంతమేర మునిగారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరికి రూ. 500 బోనస్ ఇస్తుంది కాబట్టి.. రైతులెవరూ తమ ధాన్యాన్ని ఇప్పుడే అమ్ముకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. కానీ అకాల వర్షాలతో కొంత నష్టం వాటిల్లింది. చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక.. కొంతమంది రైతులకు సంబంధించిన ధాన్యం తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంబడే మూడు రోజుల్లోనే తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పిన కాంగ్రెస్ ఆ హామీని కూడా విస్మరించింది.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండో గ్యారెంటీ రైతు భరోసా. ఈ గ్యారెంటీల భాగంగా రైతులకు ఎకరానికి 15,000 ఇవ్వాలి, కౌలు రైతులకు రూ.15,000 ఇవ్వాల్సి ఉంది. రైతు కూలీలకు ఎకరాకు రూ. 12,000 ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ గ్యారెంటీలోని ఏ హామీని రేవంత్ సర్కారు పూర్తి చేయలేదు. పాత పద్ధతిలోనే రైతు బంధు ఇస్తున్నారు.. వరికి
రూ. 500 బోనస్ ఇవ్వలేదు. కౌలు రైతుల జాడలేదు, రైతుకూలీలను పట్టించుకోవడం లేదు.
ఇక రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తలో మాట చెబుతొంది. దీంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రైతు భరోసా విషయంలో ఇటీవల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ పథకానికి ఇంకా మార్గదర్శకాలు రూపొందించలేదని చెప్పారు. ఈ సారి కూడా పాత పద్ధతిలోనే రైతు భరోసా అన్నదాతల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. పాత పద్ధతిలో అంటే ఐదెకరాలు ఉన్న రైతులకు ఇస్తారా? అన్న విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి రైతు బంధు పథకాన్ని కుదించేస్తారా? అని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తోంది అని చెప్పవచ్చు. మరి రైతాంగం ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాల్సిన అంశం.