కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నారు బీజేపీ నేతలు. తాజాగా అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై విమర్శలు గుప్పించారు. గువహటిలో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం అని.. మోసం అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ ఆరోపించారు. ఆ పార్టీకి ప్రజలకు సేవ చేయడం తెలియదని.. ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి మరో పేరు కూడా ఉందని.. అదే మోసం అంటూ మండిపడ్డారు.
అసోం రాష్ట్రంలో కాంగ్రెస్ దశాబ్దాల పాటు పాలించిందని.. అయినప్పటికీ తేయాకు తోటల కార్మికుల కోసం ఒక్క మంచి పని చేయలేదని.. అధికారంలో ఉన్నన్ని రోజులపాటు.. రాజకీయ పర్యాటకం కోసం మాత్రమే అసోంను ఉపయోగించుకున్నారని ఆరోపించారు.