కాంగ్రెస్ పార్టీ బండారం మరోసారి బయటపడింది. వ్యవస్థల మీద కాంగ్రెస్ బురద జల్లుతోందని ఆధారాలతో సహా రుజువు అయింది. ఎన్నికల ఓటింగ్ మెషిన్ల మీద కాంగ్రెస్ ఆరోపణలన్నీ తప్పుల తడక అని కేంద్ర ఎన్నికల సంఘం రుజువు చేసింది. ఈ మేరకు ఈ సి స్పష్టమైన వివరణలు బయటికి పెట్టింది.
హర్యానా ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ ఎన్నికలలో 90 సీట్లలో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 37 సీట్లలో విజయం సాధించింది. ఈవీఎంలను బీజేపీ తారుమారు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఫలితాలు వెలువడిన మొదటి రోజునే ఆరోపించింది.
ఈవీఎంలలో కొన్ని ‘తేడాలు’ బయటపడినట్లు, అలాగే ఈవీఎంల మూసివేత, భద్రతపై కాంగ్రెస్ విచారణ కోరింది. కాంగ్రెస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రులు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ నేతలు కే. సి. వేణుగోపాల్, జైరామ్ రమేష్, అజయ్ మాకెన్, పవన్ ఖెరా, హరియాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ సహా ప్రముఖ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ అధికారులను కలిసారు. హరియాణా నియోజకవర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలను వారు ఒక మెమొరాండం రూపంలో సమర్పించారు.
ఈ సందర్భంగా ఓటు మిషన్ల మీద ఆరోపణలు చేశారు.
ఈవీఎంల బ్యాటరీ 60% నుంచి 70% తో ఆపరేట్ అయ్యిందని, కొన్నీ 99% బ్యాటరీతో పనిచేశాయని కాంగ్రెస్ ఆరోపించింది.
ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ పూర్తిగా ఖండించింది. ఈవీఎంలలో పూర్తిగా చార్జ్ చేసిన బ్యాటరీలు ఉపయోగిస్తామని చెప్పారు. ఆ తర్వాత పని మొదలయ్యాక..
మాక్ పోల్స్, అసలు పోలింగ్, మరియు లెక్కింపు సమయంలో బ్యాటరీ చార్జ్ క్రమంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. అధికార వర్గాల ప్రకారం, బ్యాటరీ చార్జ్ స్థాయి మరియు ఓట్ల సంఖ్యకు సంబంధం ఉండదని ఆధారాలతో సహా వెల్లడించారు.
అంతేకాకుండా బ్యాటరీల మీద కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో ఆల్కలైన్ బ్యాటరీలు ఉపయోగిస్తామని చెప్పారు.
ఈవీఎంల లోపల బ్యాటరీ చార్జ్ 7.5 నుంచి 8 వోల్ట్ మధ్య ఉంటుందని, 7.4 వోల్ట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ సామర్థ్యం 99%గా కనిపిస్తుందని వివరించారు. బ్యాటరీ చార్జ్ 5.8 వోల్ట్ కంటే తక్కువగా వచ్చే వరకు ఈవీఎం పనిచేస్తుందని, 10% ఛార్జ్ దాటక ముందే లో బ్యాటరీ హెచ్చరిక కనిపిస్తుందని వెల్లడించారు.
ఎన్నికల లెక్కింపు ప్రక్రియ మీద కాంగ్రెస్ చేసిన ఆరోపణలు కూడా తప్పు అని తేలింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, నియమించిన లెక్కింపు కేంద్రాలలో, గుర్తించబడిన అధికారుల ఆధ్వర్యంలో రూల్ 60 కింద ఓట్ల లెక్కింపు నిర్వహించబడిందని తెలిపింది. మొత్తం లెక్కింపు ప్రక్రియ అభ్యర్థులు, అబ్సర్వర్స్, మరియు మైక్రో-అబ్సర్వర్స్ సమక్షంలో జరిగిందని పేర్కొంది.
మొత్తం మీద కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అన్నీ కూడా అబద్ధాలు అని కేంద్ర ఎన్నికల సంఘం ఆధారాలతో సహా తేల్చి చెప్పేసింది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఆధారాలతో సహా ఈ వివరాలను బయటపెట్టారు.