శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు ఫిరోజ్ ఖాన్, లైలా ఖాన్ దంపతుల 25 ఏళ్ళ కుమార్తె తానియా కక్డే మరణించింది. తానియా నిన్న రాత్రి ఓ పార్టీకి హాజరైంది, అనంతరం స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అదుపు తప్పి ఆమె ప్రయాణిస్తున్న i-20 కారు డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. తీవ్రగాయాలు కావడంతో తానియా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.. మరో ఇద్దరు స్నేహితులకు తీవ్రగాయాలయ్యాయి. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. తనియా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.