కాంగ్రెస్-కామ్రేడ్స్ కరచాలనం!!
బెంగాల్లో ఒకప్పుడు కామ్రేడ్లది సుదీర్ఘ పరిపాలన. వాళ్లమీద కాంగ్రెస్ ది అలుపెరుగని నిరసన. ఇప్పుడు సీన్ మారింది. అదే బెంగాల్లో కాంగ్రెస్-కమ్యూనిస్టు పార్టీలు చేయి చేయి కలిపాయి. కత్తులు దూసుకున్న వారే కరచాలనం చేస్తున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటు చకచకా జరుగుతున్నది. మొత్తం 294 సీట్లున్న బెంగాల్లో ఇప్పటి వరకు 193 సీట్లకు సీట్ల పంపకం పూర్తయిందని పిసిసి ప్రకటించింది. ఇందులో వామపక్ష కూటమి 101 చోట్ల పోటీ చేస్తుంది. కాంగ్రెస్ 92 సీట్లలో పోటీకి దిగుతుంది. మిగిలిన 101 సీట్ల పంపకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారట.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వరసగా రెండో సారి గెలిచింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లు గెల్చుకుంది. వామపక్ష కూటమి 33 చోట్ల నెగ్గింది. ఈసారి తృణమూల్ ను బిజెపి బలంగా ఢీకొట్టబోతోంది. కాంగ్రెస్, వామపక్షాలు చేతులు కలిపితే అది కమలనాథులకు కలిసి వస్తుందని తృణమూల్ నేతలు ఆందోళన చెందుతున్నారు. కానీ నా మాటే శాసనం అనే విధంగా వ్వహరించే మమతా బెనర్జీతో పొత్తు సాధ్యం కాదని కాంగ్రెస్-లెఫ్ట్ నేతలు భావించారు. అది మమతకు మైనస్ పాయింటు కావచ్చు. అటు మమత ముస్లిం ఓటు బ్యాంకుకు కూడా గండికొట్టే ప్రయత్నాలు భారీగా జరుగుతున్నాయి. ఇటు హిందూఓటర్లలో ఐకమత్యం పెరుగుతోంది. మమత మంత్రివర్గం నుంచి వరసగా మంత్రులు బిజెపి శిబిరంలో చేరడం మరింత ఊపందుకునే అవకాశం ఉంది.