పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ పై దృష్టిపెట్టింది. కాంగ్రెస్ పార్టీలో లుకలుకల్ని అవకాశంగా మలుచుకుంటోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్ గురు ఆప్ లో చేరారు. అయితే కొంతకాలంగా అసమ్మతిగళం వినిపిస్తున్న గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ కూ ఆ పార్టీ ఆహ్వానం పలికింది. హార్దిక్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇక రెండు రోజుల క్రితం పటేల్ చేసిన వ్యాఖ్యలతో ఆయన ఎంత అసంతృప్తిగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. కొత్త పెళ్లికొడుక్కి వెసెక్టమీ చేయించినట్టు తన పరిస్థితి ఉందని…నేనంటే లెక్కలేనప్పుడు నాకు పదవి ఎందుకని వాపోయారు హార్దిక్.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆప్ ఆయనకు స్వాగతం పలికారు. హార్దిక్ పటేల్ వంటి అంకితభావంతో పనిచేసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఇమడరని…కాంగ్రెస్ లో ఉండడం ఇష్టం లేకపోతే ఆయన వెంటనే ఆప్ లో చేరవచ్చని ఆ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా అన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే వ్యక్తులకు తాము గౌరవం ఇస్తామని..ఇప్పటికైనా మించింది లేదు, సమయం వృథా చేసుకోకుండా ఆప్ లోకి రండి.. కలిసి పార్టీని గెలిపించుకుందాం అని ఇటాలియా ఆఫర్ చేశారు. రెండురోజులనాటి హార్దిక్ కామెంట్స్, తాజాగా ఇటాలియా వ్యాఖ్యలు ఇప్పుడక్కడ చర్చనీయాంశాలయ్యాయి.
రాష్ట్ర పార్టీ తనను వేధిస్తోందని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిన హార్దిక్ …రాహుల్ దృష్టికీ తీసుకెళ్లారు. అయినా ప్రయోజనం లేకపోయిందని పలుమార్లు వాపోయారు.
ఈ ఏడాది గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేరికలపై ఆ పార్టీ దృష్టిపెట్టింది. ఖోదాల్దమ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్ నరేష్ పటేల్ ను పార్టీలో చేర్చుకోవాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండగా..అందుకు హార్దిక్ పటేల్ వ్యతిరేకిస్తున్నారు. 2017లో హార్దిక్ ను ఉపయోగించుకున్నారు. 2022 వచ్చేసరికి నరేశ్ కావాల్సి వచ్చిందా..2017లో మరో పాటీదార్ నాయకుడికోసం చూస్తారా…హార్దిక్ పటేల్ నే శక్తిమంతుడిగా పార్టీ తయారుచేయలేదా అని అధిష్టానాన్ని ప్రశ్నించారాయన. ఈ పరిణామాలు పార్టీ హైకమాండ్ కు కొత్త తలనొప్పులేనని చెప్పవచ్చు. మరి ఈ ఏడాది చివర్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.