ఢిల్లీలో అంగన్ వాడీ వర్కర్ల సమ్మె మూడోవారానికి చేరుకుంది. మెరుగైన వేతనం సహా…పీఎఫ్, పెన్షన్లు, వైద్య సహాయం, రెగ్యులరైజ్డ్ ప్రభుత్వ ఉద్యోగం, పునరుద్ధరించిన వితంతు పింఛన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తమ సమస్యలు పరిష్కరించకపోగా ప్రభుత్వం తమకు బెదిరింపు మెసేజ్ లు పంపుతోందని కార్యకర్తలు, సహాయకులు వాపోతున్నారు. 31 జనవరి 2022 నుంచి వారు సమ్మె చేస్తున్న సిబ్బంది సీఎం నివాసం ఎదుట కూడా నిరసనలకు దిగారు. అయితే వారి సమస్యలు పట్టించుకునే స్థితిలో ఢిల్లీ రాష్ట్ర సర్కారు లేదు. కేజ్రీ సహా కేబినెట్ మంత్రులు, ఇతర నేతలు పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
ఢిల్లీలోని వికాస్ భవన్ సమీపంలోని సివిల్ సైన్స్ వీధులు నిరసనకారులతోస నిండి కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల క్రితం ఇదే ఢిల్లీలోని షాహిన్ భాగ్ లో సీఎఎ వ్యతిరేక నిరసనల సందర్భంగా రోడ్లు బ్లాక్ చేసి మరీ నిరసనకారులకు కొందరు ఫైవ్ స్టార్ సౌకర్యాలు కల్పించిన ఘటనల్ని మనం చూశాం. కానీ అంగన్వాడీ కార్మికులకు మాత్రం కనీస నీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం గమనార్హం.
ఆప్ ఎమ్మెల్యేల కార్యాలయాల ఎదుట కూడా కార్మికులు నిరసనలు తెలుపుతున్నారు. అయితే వారి సమస్యల్ని పరిష్కరించకపోగా ప్రారంభించిన రోజునుంచే సమ్మెను ముగించే ప్రయత్నం చేస్తోంది కేజ్రీ సర్కారు. ముఖ్య సమాచారాన్ని, నిరసనల వివరాల్ని షేర్ చేయడం కోసం అంగన్వాడీలకు ఇచ్చిన ఉచిత స్మార్ట్ ఫోన్లలకు హెచ్చరిక నోటీసులు పంపుతున్నారు సంబంధింత అధికారులు సమ్మె విరమించి పనిలో చేరకపోతే చర్యలు తీసుకుంటామని వాట్సప్ మెసేజులు పంపిస్తున్నారు.
శివ విహార్లో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు, అలాగే ప్రేమ్ నగర్ ప్రాంతంలో నిరసనల్లో ఉన్న కార్యకర్తలకు చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి 14 ఫిబ్రవరి 2022న హెచ్చరిక మెసేజ్ లు వెళ్లినట్టు తెలిసింది. హాజరుకాని రోజులకు జీతాలు ఇవ్వబోమని… విధులకు హాజరు కాకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవంటూ సీమాపురిలో నిరసనలో ఉన్న 47 మంది కార్మికులకు ఒకేసారి నోటీసులు వెళ్లాయి.
అయితే ప్రధాన కార్యాలయం నుంచి కార్మికులకు ఎలాంటి హెచ్చరిక నోటీసులు ఇవ్వలేదని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ రష్మీ సింగ్ అంటున్నారు. ఢిల్లీలో దాదాపు 20వేల మంది అంగన్ వాడీ కార్యకర్తలు, సహాయకులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వారికి 6 వేల రూపాయలు మాత్రమే గౌరవవేతనంగా ఇస్తున్నారు.