ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనిస్టుల పరిస్థితి మరీ కామెడీ అయిపోయింది. బీజేపీ తో తెలుగుదేశం జత కట్టకూడదు అని అందరు దేవుళ్లకూ తెగ మొక్కుకొన్నారు. కానీ కామ్రెడ్ల మొక్కుబడులను దేవుడు ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో బీజేపీ తో తెలుగుదేశం పొత్తు పెట్టేసుకొంది. అప్పటి దాకా టీడీపీ గుమ్మం దగ్గర పడిగాపులు కాసిన కామ్రెడ్లు.. చివరకు కాంగ్రెస్ పంచన చేరారు. కానీ అక్కడ కూడా పరిస్థితి ఏమాత్రం బాగోలేదు.
కాంగ్రెస్ తో తమకు లాభమో, నష్టమో కామ్రెడ్లకు తెలియటం లేదు. ఎందుకంటే.. దేశ రాజకీయాల్లో ఎన్డీఏ దూకుడు కనిపిస్తోంది. రామనాదం.. దేశభక్తి గానంతో బీజేపీ ఉరుకులు పరుగులు పెడుతోంది. ఇక లౌకిక శక్తులు జత కలవక పోతే దేశంలో మతోన్మాదం పెచ్చురిల్లే అవకాశం ఉందనేది వామపక్ష పార్టీలు సహా లౌకిక వాదుల ఆలోచన. అందుకే ఇండియా కూటమి ఆవర్భవించింది. కాంగ్రెస్ , సీపీఐ, సీపీఎం సహా లౌకిక పార్టీలు జత కలిశాయి. కానీ, ఈ కలయిక ఏపీలోని లెప్ట్ పార్టీలను ఇరుకున పెట్టాయి. కాంగ్రెస్తో కలిసి పయనిస్తే జనం ఏ రీతిలో తమను చేరదీస్తారో అంతుబట్టని అంశం. అధికారంపై అత్యాశతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందనే భావన జనంలో ఇంకా తగ్గలేదు. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అంపశయ్యపై కోమా దశలో ఉంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకతతో రగిలిపోతున్న జనాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ .. దివంగత నేత వైఎస్సార్ తనయను రంగంలోకి దించింది. ప్రస్తుతం గెలుపు సంగతేమో గానీ.. ప్రభుత్వ చర్యలపై విసిగిన జనం ప్రత్యామ్నాయాన్ని పరిశీలిస్తున్నారు. ఇక రాష్ట్రాన్ని విభజించాలని సీపీఐ కోరింది. అందుకే ఈ పార్టీపై జనంలో ఆగ్రహం తగ్గటం లేదు. పోలవరం నిర్వాసితులు, విశాఖ ఉక్కు సమస్యలపై పోరాడినా జనంలో నమ్మకం కలగటం లేదు. సీపీఐ నిర్ణయాలను వ్యతిరేకించటమే సీపీఎం లక్ష్యం, అందుకే రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా.. సీపీఎంను జనం నమ్మలేదు. అంటే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఈ మూడు పార్టీలపై ఏపీ జనంలో సానుకూల ప్రభావం కనిపించటం లేదనేది రాజకీయ వర్గాల విశ్లేషణ.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ, సీపీఎం జత కట్టటంతో ఏపీలోనూ ఉభయపార్టీలు చేతులు కలిపాయి. ఐతే, ఈ ఎన్నికల్లో అగ్రనాయకులెవరూ పోటీ చేయటం లేదు. సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కె.రామకృష్ఱ 1994లో అనంతపురం ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో టీడీపీతో పొత్తుతో ఆ సీటు లభించింది. ఇక 2014, 2019 ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసిన జాడ లేదు. విశాఖపట్నం నాయకుడు జె.సత్యనారాయణ మూర్తి, గుంటూరు నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరి జాడ లేదు. ప్రస్తుతం గుంటూరుఎంపీ అభ్యర్థిగా జంగాల అజయ్ కుమార్ , విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా జీ కోటేశ్వరరావు,విశాఖపట్నం వెస్ట్అభ్యర్థిగా అత్తిలి విమల,అనంతపురం అభ్యర్థిగా జాఫర్ , పత్తికొండ అభ్యర్థిగా రామచంద్రయ్య , తిరుపతి అభ్యర్థిగా పి.మురళి , రాజంపేట అభ్యర్థిగా బూక్యా విశ్వనాథ్ నాయక్ , ఏలూరు అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావు , కమలాపురం అభ్యర్థిగా నర్రెడ్డి శివరామ రెడ్డిసీపీఐ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.
ఇక సీపీఎంలోనూ ఇదే స్థితి. గతంలో జరిగిన ఎన్నికల్లో కార్యదర్శి హోదా నాయకులు పోటీల్లో కనిపిస్తే.. ఈ ఎన్నకల్లో అగ్రనాయకులెవరూ లేరు. రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుల్లో కొందరూ ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. మంగళగిరి లో జొన్నా శివశంకరరావు, రంపచోడవరంలో లోతా రామారావు, అరకు ఎంపీ అభ్యర్థిగా పాచిపెంట అప్పల నర్స , నెల్లూరు సిటీలో ఆదిమూలపు రమేష్ . విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా సీహెచ్ బాబురావు, గన్నవరంలో కళ్లం వెంకటేశ్వరరావు, కురుపాంలో మందంగి రమణ , గాజువాకలో మరడాన జగ్గునాయుడు సీపీఎం అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.
అసలు అగ్ర నేతలే ముఖం చాటేయటంతో కమ్యూనిస్టుల పరిస్థితి ఏమిటి అనేది అందరికీ అర్థం అయిపోతోంది. కొడిగట్టిన దీపాలను ఆదర్శంగా తీసుకొని ఎర్రజెండా ను ముందుకు తీసుకొని వెళుతున్నారు అని అర్థం అవుతుంది.