కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయమంటూ కొత్త కూటమికోసం తెలంగాణ సీఎం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు అసాధ్యమని ఆయన అన్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ కొత్త కూటమిలో ఉండాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ప్రత్యామ్నాయ కూటమి గురించి గతంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నప్పుడు కూడా తాము ఇదే మాట చెప్పామని కాంగ్రెస్ కలుపుకోవాల్సిందేనన్నానని రౌత్ గుర్తు చేశారు.
రెండు రోజుల క్రితమే కేసీఆర్ ముంబై వెళ్లి సీఎం ఉద్ధవ్ తోనూ, శరద్ పవార్ తోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ ఈ మాటలనడం గమనార్హం. .అంతేకాదు ఆదివారం నాటి కేసీఆర్-ఉద్ధవ్ ఠాక్రే చర్చల్లో కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటు అనే మాటే రాలేదన్నారు.
అటు ఠాక్రే, కేసీఆర్ భేటీపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. కేసీఆర్ కూటమి ప్రయత్నాలు ఫలించబోవన్నారు. 2019 ఎన్నికలముందూ ఇలాంటి ప్రయత్నాలే చేశారని…ఏం జరిగిందో అందరికీ తెలుసని ఫడ్నవిస్ అన్నారు.