తిరుపతిలో కూటమి అభ్యర్థి ఎవరు?
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి (ఎస్ సి రిజర్వుడు)లోక్ సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో బిజెపి-జనసేన కూటమి నుంచి పోటీ చేసేది ఏ పార్టీ అనేది ఇంకా తేలలేదు. ఇది తేలితే గానీ అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు అవకాశం లేదు. సామాజిక కోణంలో ఇక్కడ జనసేన పోటీ చేయడమే మంచిదని ఆ పార్టీ నేతల అభిప్రాయం. లేదు మేమే పోటీ చేస్తాం అనేది బిజెపి నేతల ఉద్దేశం. చివరకు బిజెపి జాతీయ నాయకత్వంఓ ఏం చెబితే అదే ఫైనల్ అని శుక్రవారం పవన్ కల్యాణ్ కూడా విలేకర్ల సమావేశంలో చెప్పారు. ఎవరు పోటీచేసినా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం ప్రయత్నిస్తామన్నారు. అయితే గత కొంత కాలంగా బిజెపి-జనసేన మధ్య గ్యాప్ వచ్చినట్టుంది. అది కొంత వరకు వాస్తవమే అన్నారు పవన్. కూర్చుని మాట్లాడుకుని అన్ని అనుమానాలు నివృత్తి చేసుకుంటాం అన్నారు. ఈ సీటును వైసిపి చావో రేవో అన్నట్టుగా తీసుకుంటుంది. అందులో అనుమానం లేదు. తన సీటును తాను నిలుపుకోలేక పోతే పరువు పోతుంది. ఎటొచ్చీ టిడిపి, కాంగ్రెస్ శిబిరాల్లోనే అంత ఉత్సాహం కనిపించడం లేదు. టిడిపి కొంత పరవాలేదని అనిపిస్తున్నా కాంగ్రెస్ లో కొందరు మినహా ఎక్కువ మందిలోసమరోత్సాహం కనిపించడం లేదు.
ఒక్క సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే, తిరుపతి నియోజకవర్గానికి ఒక అరుదైన రికార్డు ఉంది. బహుశా అది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. అదేమిటంటే, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు జమానా వరకు ఇక్కడ తెలుగు దేశం పార్టీ ఒక్క సారి మాత్రమే గెలిచింది. ఒక్కసారి కమలం వికసించింది. మిగిలిన అన్నిసార్లూ కాంగ్రెస్ దే గెలుపు. కాకపోతే 2014, 2019లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నెగ్గింది. ఈసారి బిజెపి నేను సైతం అంటూ బరిలోకి దిగి విజయం సాధించాలని తహతహలాడుతోంది.
తిరుపతిలో 1952 నుంచి 1980 వరకూ భారత జాతీయ కాంగ్రెస్ వరసగా గెలిచింది. 1984లో టిడిపి టికెట్ పై చింతా మోహన్ పోటీ చేసి గెలిచారు. 1984లో ఆయన కాంగ్రెస్ లో చేరి పోటీ చేసి గెలిచారు. అలా అప్పటి నుంచి 1998 వరకు కాంగ్రెస్ దే హవా. 1999లో మాత్రం టిడిపి పొత్తుతో బిజెపి పోటీ చేసి గెలిచింది. 2004, 2009లో మళ్లీ కాంగ్రెస్ నెగ్గింది. 2014, 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ గెలిచింది.
టిడిపి ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 10 సార్లు లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి మాత్రమే సైకిల్ గుర్తు గెలవడం విశేషం. 1999లో టిడిపి మద్దతుతో బిజెపి అభ్యర్థిగా ఎన్. వెంకటస్వామి గెలిచారు. అదే ఇప్పుడు కమలనాథులకు కొండంత స్ఫూర్తినిస్తున్నది. బి దుర్గా ప్రసాద్ అకాల మరణం కారణంగా త్వరలోనే తిరుపతిలో ఉప ఎన్నిక జరగబోతోంది. పవన్ కల్యాణ్ జనసేన పొత్తుతో ఏడుకొండల వాడి పాదాల చెంతన, అంటే తిరుపతిలో పరపతి పెంచుకోవానేది కమలనాథుల ఆశ.
2019 లోక్ సభ ఎన్నికల్లో వైసిపి ఏకపక్ష విజయం సాధించింది. మొత్తం 13,16,473 మంది ఓటు వేశారు. వైసిపి అభ్యర్థి గుర్గాప్రసాద్ రావు 7 లక్షల 22 వేల 877 ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి, టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి 4 లక్షల 94 వేల 501 ఓట్లు గెల్చుకున్నారు. బిజెపి అభ్యర్థి బొమ్మి శ్రీహరి రావు కేవలం 16,125 ఓట్లతో ఆరోస్థానంలో నిలిచారు. ఇక్కడ ఓట్ల సంఖ్య విషయంలో నోటా మూడో స్థానంలో ఉండటం విశేషం. ఆరుసార్లు తిరుపతి ఎంపి గా గెలిచిన చింతా మోహన్ 2019లో మాత్రం కేవలం 24,039 ఓట్లు పొంది నాలుగో స్థానానికి పరిమితం కావడం మరో విశేషం.
ఈసారి వైసిపి, కాంగ్రెస్ అభ్యర్థులు ఇప్పటికే దాదాపుగా ఖరారైనట్టే అనే ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల కారణంగా ఎన్డీయే కూటమి తరఫున తమకు ఈ సీటును వదిలిపెట్టాలని జనసేన కోరుకుంది. కానీ బిజెపి పోటీకి సిద్ధపడుతోంది. గత ఎన్నికల్లో ఊహించనంత దారుణంగా దెబ్బతిన్న టిడిపి ఈసారి పరువు నిలుపుకోవడానికి గట్టి అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచిస్తోంది. కాంగ్రెస్ లో మాత్రం కదనోత్సాహం కనిపించడం లేదు.