దేశం ప్రస్తుతం బొగ్గు కొరత ఎదుర్కొంటోంది.
దీంతో రైల్వే చాలా ప్రయాణీకుల రైళ్లు క్యాన్సల్ చేసింది..బొగ్గుతో ట్రైన్స్ నడవనప్పుడు ప్రయాణీకుల ట్రైన్స్ ఎందుకు కాన్సిల్ చేయాలి అని కొందరి అనుమానం. వారికి సమాధానమే ఈ పోస్ట్.
మన దేశం బొగ్గు ఎక్కువగా థర్మల్ ప్లాంట్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.
ఇన్నాళ్ళు తీర ప్రాంతాల్లో ఉన్న పవర్ ప్లాంట్స్ విదేశాల నుండి దిగుమతి చేసుకునే బొగ్గుతో నడిపేవారు. కానీ యూరోప్ లో పవర్ క్రైసిస్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా బొగ్గు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆ ధరకు బొగ్గు కొంటే వినియోగదారుల విద్యుత్ చార్జీలు భారీగా పెంచాలి. ఉచిత విద్యుత్ వాగ్దానాల స్కీముల తో అప్పులు పాలు అవుతున్న రాష్ట్రాలు ఈ పని చేయలేవు.
అంతే కాక పలు రాష్ట్రాలు సప్లై చేసిన విద్యుత్ కి ధర్మల్ ప్లాంట్స్ కి డబ్బులు ఇవ్వకుండా బాకీ పెట్టడంతో, బొగ్గు కొనుక్కుందికి వాటి దగ్గర నిధుల కొరత వచ్చింది. విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకుంటూ ఉండటంతో దేశీయ బొగ్గుకి డిమాండ్ లేకపోవడంతో మన దేశ బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ ఇండియా ఉత్పత్తి తగ్గించింది అంటే గనుల తవ్వకాలు తగ్గించింది.
ఈ కారణాలు అన్నిటి వల్ల దేశంలో బొగ్గు కొరత ఏర్పడి విద్యుత్ కోత ఏర్పడుతోంది. కరోనా టైం లో ఆక్సిజన్ కొరత లాగే ముందుగా ఎంత అవసరం పడుతుందో ప్రణాళికలు చేసుకోకుండా చివరి నిమిషంలో చేతులు యెత్తేసినట్లే ఇప్పుడు రాష్ట్రాలు కేంద్రం మా విద్యుత్ సంస్థలకు తగినంత బొగ్గు సరఫరా చేయలేకపోవడం చేత మా రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తి చేయలేక కరెంట్ కోతలు పెడుతున్నాము అని కేంద్రం పై నింద మోపి తప్పించుకుందాం అని చూస్తున్నాయి.
కానీ గత అక్టోబర్ నుండి కేంద్రం మీ దగ్గర సరిపడినంత బోగ్గున్నిల్వలు వుండేటట్లు చూసుకోండి లేక పోతే విద్యుత్ కోతలు తప్పవు అని రాష్ట్రాలకు గుర్తు చేస్తూనే వుంది. కానీ కేంద్రం మాట రాష్ట్రాలు లైట్ తీసుకున్నాయి.
సరే…ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కూర్చుంటే సమస్య పరిష్కారం కాదు అని కేంద్రం కోల్ ఇండియా ద్వారా బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెంచింది. ప్రస్తుతం దేశంలో ఒక నెల వినియోగానికి సరిపోయే నిల్వలు ఉన్నాయి. ఉత్పత్తి కూడా పెంచారు కాబట్టి బొగ్గు కొరత లేదు. కానీ బొగ్గు ఎక్కువగా దొరికే ప్రదేశాల నుండి తవ్విన బొగ్గు దూర ప్రాంత పవర్ ప్లాంట్స్ కి పంపడం చాలా టైం తో కూడుకున్న వ్యవహారం. అంతే కాక బొగ్గు గూడ్స్ ట్రైన్స్ ద్వారానే యెక్కువగా రవాణా అవుతుంది. బొగ్గు వివిధ రాష్ట్రాలకు వేగంగా సరఫరా చేయడానికి తమకు సుమారు ఒక లక్ష వేగన్స్ అవసరం పడతాయి అని రైల్వే శాఖ చెప్పింది. అంటే రైల్వేలు వేగన్స్ కొరత ఎదుర్కొంటున్నాయి. కారణం లోడింగ్, అన్ లోడింగ్ మరియు దూర ప్రాంతాలకు ప్రయాణ సమయం ఎక్కువ కావడంతో ఒకే సారి ఇన్ని కొత్త గూడ్స్ ట్రైన్స్ పట్టాలు మీద ప్రయాణిస్తూ వుండడంతో పట్టాలు ఖాలీ లేక బొగ్గు దింపేసిన వేగన్లు వెనక్కి రావడానికి సమయం పడుతోంది. అంటే గూడ్స్ వాగన్స్ రొటేషన్ ఆలస్యం అవుతూ వుండడంతో విద్యుత్ ప్లాంట్స్ కి బొగ్గు సరఫరా ఆలస్యం అవుతోంది.
దీనిని అధిగమించడానికి రైల్వే శాఖ సుమారు 700 ప్రయాణీకుల రైళ్లు కేన్సిల్ చేసి ట్రాక్స్ ఖాళీగా వుంచే పని చేపట్టింది. అసలే 2 సం.లుగా కరొనాతో ఇళ్ళల్లో బంధింపబడి ఉన్న వారు వేసవి సెలవుల్లో ప్రయాణాలు పెట్టుకుని ట్రైన్స్ కాన్సిల్ అవడం తో ఆగ్రహం చెందుతున్నారు.
ఇంతలా ప్రయాణీకుల ట్రైన్స్ కాన్సిల్ చేసినా బొగ్గు రవాణా రైళ్లకు ఇంకా ట్రాక్స్ ఖాళీగా దొరకక పోవడంతో చాలా చోట్ల చాలా మైల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని కూడా మధ్య చిన్న స్టేషన్లు లో ఆపేసి బొగ్గు రవాణా రైళ్లకు ముందు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ పద్దతి వల్ల ఇబ్బంది పడుతున్న బాధితుల్లో ప్రస్తుతం నేనూ ఒకడిని. నిన్న రాత్రి 9గం.లకు గయలో ఎక్స్ప్రెస్ ఎక్కాను ఈ ఉదయం 9 గంటలకు అయోధ్య చేరాలి. కానీ ఇప్పటికీ సుమారు 6 గంటలు ఆలస్యం. ఎందుకంటే మా ఎక్స్ప్రెస్ రైలు వివిధ స్టేషన్లు లో అపి సుమారు ఇప్పటి వరకు ఒక 20 బొగ్గు ట్రైన్స్ మ ఎక్స్ప్రెస్ కంటే ముందు పంపించాడు. దీనిని బట్టి పరిస్తితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. ఇంకా 150 కి.మీ దూరం ఉన్న అయోధ్యకు సాయంత్రం ఏ 5 గం. లకో చేరే అవకాశం వుంది.
ఏది ఏమయినా ఉచితాలు వల్ల రాష్ట్రాలకు ఆర్థిక భారం పెరిగి విద్యుత్ సంస్థలకు బకాయిలు పెట్టేస్తున్నాయి. డబ్బులు లేక విద్యుత్ సంస్థలు బొగ్గు కొనుగోలు చేయలేక చేతులు ఎత్తేస్తున్నాయి.
ఈ సమస్య ఇంకో నెల రోజులు కొనసాగవచ్చు.
ఇటువంటి ట్రాక్స్ బిజీ సమస్యలు భవిష్యత్ లో రాకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతోనే మోడీ ప్రభుత్వం గూడ్స్ ట్రైన్స్ మాత్రమే నడిచే ప్రత్యేక రైల్వే లైన్ కారిడార్స్ శర వేగంతో నిర్మిస్తోంది. వాటికే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ అని పేరు పెట్టారు. వాజపేయి దేశం నలుమూలలూ స్వర్ణ చతుర్భుజి హై వే లతో కలిపినట్లే ఇప్పుడు దేశం నాలుగు మూలలు కలుపుతూ ఈ ప్రత్యేక గూడ్స్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 700కి.మీ మార్గం నిర్మించారు.
~ చాడా శాస్త్రి




(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)