ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు అయోధ్యలో రామమందిర గర్భగృహానికి శంకుస్థాపన చేశారు. మంత్రోచ్ఛారణలు, వైదిక ఆచారాల మధ్య రామ మందిర ప్రధాన నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆదిత్యనాథ్, దేవాలయం నిర్మాణం కోసం 500 ఏళ్ల పోరాటం ముగిసిందని.. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. ఈ ఆలయం ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. దీని పనులు శరవేగంగా ముందుకు సాగుతాయని చెప్పారు. రామమందిరం భారత జాతీయ దేవాలయం కానుందని, ఈ రోజు కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని, రామమందిరం భారతదేశ ఐక్యతకు చిహ్నంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య, రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 11 మంది అర్చకులు పూజలు జరిపారు.రామమందిర నిర్మాణ పనులకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఆదిత్యనాథ్ విడుదల చేశారు.
రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ప్రభుత్వం ఫిబ్రవరి 2020లో ఏర్పాటు చేసిన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం (SRJBTK) ప్రకారం, ఆలయ నిర్మాణం (మూడు అంతస్తుల నిర్మాణం) శరవేగంగా జరుగుతోంది. ఈ ఆలయాన్ని డిసెంబర్ 2023 నాటికి ప్రజల కోసం తెరవాలని నిర్ణయించారు.