
ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ చీఫ్ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘‘ఓఆర్ఆర్’’ పై వస్తున్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన మీరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మీ మౌనం ఓఆర్ఆర్ టెండర్లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను మరింత బలపరుస్తోందన్నారు. ఓఆర్ఆర్ టెండర్ నోటిఫికేషన్ దగ్గర నుంచి ఫైనలైజేషన్ వరకు రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యమేంటని నిలదీశారు సంజయ్.
టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలను ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలకు, మీడియా సంస్థలకు లీగల్ నోటీసులతో బెదిరించడం సిగ్గుచేటని సంజయ్ వ్యాఖ్యానించారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు.
ఓఆర్ఆర్ టోల్ టెండర్ ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. తక్షణమే ఓఆర్ఆర్ టోల్ టెండర్ వ్యవహారంపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని సంజయ్ సవాల్ విసిరారు.