ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టీం మరో అగ్నిపరీక్ష ఎదుర్కోబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఖ్యాతి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ అధిష్టానం తలపోసి ఆయనకే సీఎం కుర్చీ అప్పగించింది. మంత్రివర్గ ఏర్పాటు, ఇతర నిర్ణయాల్లో రేవంత్ కు స్వేచ్ఛ ఇస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించింది. అప్పట్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా లాబీయింగ్ నడిపిన కాంగ్రెస్ సీనియర్ల నోటికి తాళం వేసింది.
ఈలోగా పార్లమెంటు ఎన్నికలు ముందుకు వచ్చాయి. ఇక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహరించారు. ముందుగానే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ.. స్థానికంగా ఉండే సీనియర్ మంత్రిని ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించేశారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యత మంత్రుల మీద పడింది. దీనిని తప్పించుకునే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ సీనియర్లు అందరూ పార్లమెంటు ఎన్నికల పనిలో పడ్డారు. తెలంగాణ అంతట పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఒకటి రెండు స్థానాలు తప్ప బీఆర్ఎస్ కు పెద్దగా ఆశలు కనిపించడం లేదు. బిజెపి కొంతమేర బలపడినప్పటికీ కూడా… ఎక్కువ సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం ఖాయం. ఈ క్రెడిట్ తో రేవంత్ రెడ్డి మరింత బలపడటం అంతే ఖాయం.
సరిగ్గా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. గతంలో ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసి జనగాం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అక్కడ ఎన్నిక అనివార్యమైంది .
సోషల్ మీడియా సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్న చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ను కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టారు. ఈ మూడు జిల్లాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు గట్టి బలం ఉంది. ఈ ప్రాంతంలో 25 అసెంబ్లీ స్థానాలకు గాను 20 కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలుపొందారు. అటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు సునాయాసం కావలసి ఉంది. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు కూడా ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. పైగా తీన్మార్ మల్లన్న కు ప్రతి ఊర్లోను శత్రువులు ఖాయంగా కనిపిస్తున్నారు. అటువంటి అప్పుడు తీన్మార్ మల్లన్న గెలుపు రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది.
మరోవైపు బిజెపి తరఫున గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తలపడుతున్నారు. పార్టీకి పూర్తిస్థాయి విశ్వాసపరుడుగా ఆయనకు పేరు ఉంది. అటు బిఆర్ఎస్ పార్టీ తరఫున ఇటీవలే గులాబీ పార్టీలో చేరిన రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. రాకేష్ గెలుపు కోసం కేటీఆర్ స్వయంగా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు.
మరో విషయం కూడా గమనించుకోవాలి. బిజెపికి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పెద్దగా పట్టు లేదు .వరంగల్లో మాత్రమే కొంతమేర బలం కనిపిస్తుంది. అటు బిఆర్ఎస్ పార్టీకి కూడా ఈ ఇబ్బంది వెంటాడుతుంది. కానీ తీన్మార్ మల్లన్న తో పోల్చుకుంటే ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి ఆర్థికంగా ధనవంతులు, విద్యావంతులు కావడంతో ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేయగలరు అనే మాట వినిపిస్తోంది .
మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గెలుపు తమ గెలుపు అని సీనియర్లంతా నడుం కడితే పర్వాలేదు,, లేని పక్షంలో మాత్రం రేవంత్ రెడ్డికి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది.