తెలంగాణ సీఎం కేసీఆర్ వికారాబాద్ లో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. మధ్యాహ్నం 2 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వికారాబాద్ పట్టణానికి చేరుకున్నారు. ఎప్పటి నుంచో అక్కడి స్థానికులు ఎదురుచూస్తోన్న వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, చేవెళ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి, వాణి దేవి, ఎమ్మెల్యేలు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
61 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కలెక్టరేట్ భవనం అందుబాటులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో శాఖలన్నీ ఒకే గూటికి చేరుకున్నాయి. కలెక్టరేట్ ప్రారంభం చేసిన తర్వాత జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ ను జిల్లాగా చేశామన్నారు. ఉద్యమ సమయంలో జిల్లా కార్యాలయాలు వికారాబాద్ లో పెట్టాలని స్థానికులు కోరేవారని.. తెలంగాణ వస్తే ఏకంగా వికారాబాద్ ని జిల్లా మారుస్తామని మాటిచ్చామని గుర్తుచేశారు. రైతు బంధు, రైతు బీమా పక్కగా అమలవుతున్నాయి. 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. గతంలో రైతు మరణిస్తే 50 వేలు ఇచ్చేవారని.. అదే ఇప్పుడు ఎకరం భూమి ఉన్న రైతు చనిపోయినా 10 రోజులలోపే 5 లక్షల రైతు భీమా అందిస్తున్నామని తెలిపారు. వచ్చిన తెలంగాణను గుంటనక్కల పాలు కాకుండా చూడాలి.. సంక్షేమ పథకాలను ఉచితాలని కేంద్రం అంటోంది. వికారాబాద్ కు మెడికల్, డిగ్రీ కళాశాల మంజూరు చేశామన్నారు.