తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన దేశంలోని తొలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం కేసీఆర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఈరోజు ప్రారంభించారు. 600 కోట్లతో 20 అంతస్థుల్లో ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని ప్రభుత్వం నిర్మించింది. 600 కోట్లతో 20 అంతస్థుల్లో కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించింది. బంజారాహిల్స్ లోని రోడ్ నంబర్ 12లో ఏడెకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్ణించారు. ఇందులో ఐదు టవర్లు ఉన్నాయి. భవనం మొత్తం ఎత్తు 83.5మీటర్లు. టవర్ ‘A’లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంటుంది.
సెంటర్ లో ప్రతి భవనంలో సౌకర్యాలను తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలంగాణ డీజీపీ సహా పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సీఎం కేసీఆర్ తిలకించారు. జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద ఉన్న సీసీ కెమెరాల దృశ్యాలను సీఎం పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ తో అనుసంధానం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని.. ఇప్పటిదాకా 9.5 లక్షల కెమెరాలు అమర్చామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా 365 రోజులు, 24/7 గంటలు ఎక్కడ ఏం జరిగినా వీక్షించే అవకాశం ఉందన్నారు. ఆ సీసీ ఫుటేజీని 30 రోజుల దాకా భద్రపరిచే ఏర్పాట్లు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నాయన్నారు. ప్రత్యేక బ్యాక్ ఎండ్ బృందాలు నిరంతరం వాటిని పరిశీలిస్తూ.. రాష్ట్రంలోని ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఏం జరిగినా వెంటనే గుర్తించి అక్కడి అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు.. తక్షణమే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆయా ప్రాంతాల్లోని అధికారులకు సూచిస్తాయి.