రైతు బంధులు కాదు.. రాబందులు.. కాంగ్రెస్పై సీఎం కేసీఆర్ ఫైర్
కాంగ్రెస్ పార్టీది దోపిడి రాజ్యం.. దొంగల రాజ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. హైదరాబాద్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసింది ఎవరని ..?గులాబీ జెండా ఎందుకు పుట్టాల్సి వచ్చిందని.. ప్రాజెక్టులన్నీ ఆంధ్రా ప్రాంతానికి అనుకూలంగా కడుతుంటే నోరు మూసుకొని కూర్చుందెవ్వరని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు అవనీతిరహిత పాలన కావాలని కోరకుంటున్నారని.. హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ అన్నారు.
త్వరలో తెలంగాణ రాష్ట్రం భూ సమస్యలు లేని రాష్ట్రంగా మారబోతోందని.. కాంగ్రెస్ నేతలు రైతు బంధులు కాదని.. వారు రాబందులని అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి సీఎంగా ఉన్న కిరణ్కుమార్ రెడ్డి తెలంగాణ ప్రాంతానికి ఒక్క రూపాయి ఇవ్వను అని అంటే ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా ఎదురుతిరగలేదని అన్నారు. నల్లగొండకు ప్రాజెక్టులు మంజూరు చేస్తే కమీషన్ల కోసం చేశామని ఆరోపిస్తున్నారని.. ప్రజలకు మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక విమర్శలు చేస్తుందన్నారు. ఈ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం ఒక జనరేషన్ను పూర్తిగా నాశనం చేసిందని.. ఇందుకోసం ఎవరైనా పోరాటం చేశారా అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫ్లోరైడ్ భూతాన్ని జిల్లా నుంచి పూర్తిగా తరిమేశామని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా పట్టించుకోలేదని.. పొలాలను ఎండబెట్టినా.. ఎవరూ కనీసం మాట్లాడలేదన్నారు. కరెంట్ లేక.. ఎరువుల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారి గురించి అడిగే దిక్కులేదన్నారు. కాంగ్రెస్ నేతలు ఇవ్వడం చేతకకా.. మేం ఇస్తుంటే విమర్శలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.