పట్టణాలు ,నగరాలలో పరిశుభ్రతను పెంచేందుకు దేశవ్యాప్తంగా స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ పనుల్ని కూడా పూర్తిస్థాయిలో స్థానికంగానే చేయించుకోవాలని.. నిధులు నేరుగా మున్సిపాలిటీలకు మంజూరు చేస్తున్నారు.
మన తెలంగాణలోని మున్సిపల్ కార్పొరేషన్ లు, పట్టణాలు, పెద్ద గ్రామాలకు ఇందుకు సంబంధించిన నిధులు విడుదల అయ్యాయి. అయినప్పటికీ అధికారులు అలసత్వం నాయకుల నిర్లక్ష్యంతో ప్రజలకు సమస్యలు తప్పడం లేదు. ప్రతి పట్టణంలోనూ చెత్తను సేకరించి ఒక చోటకు చేర్చడం, దానిని వ్యర్ధాలుగా విడదీసి రీసైక్లింగ్ చేయించడం, ఊరికి దూరంగా పంపించడం.. ఈ మూడు పనుల్ని నిర్వహించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సమృద్ధిగా నిధులు ఇస్తోంది. ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉంచేందుకు కేంద్ర సర్కారు అన్ని చర్యలు తీసుకుంటోంది. కానీ స్థానిక నాయకులు లైట్ గా తీసుకోవడంతో ప్రజలకు చాలా అవస్థలు ఏర్పడుతున్నాయి.
ఉదాహరణకు మన తెలంగాణలోని బోథ్ పట్టణం విషయమే తీసుకుంటే.. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ఈ పట్టణం కూడా ఉంది. అయినప్పటికీ పట్టణంలో ఎక్కడ స్వచ్ఛత , పరిశుభ్రత కనిపించడం లేదు. ఊరినిండా ఎక్కడ చెత్త అక్కడే తిష్ట వేసుకుని కనిపిస్తోంది. వర్షాలు మొదలు కావడంతో దోమలు చెలరేగిపోయి పట్టణమంతా క్రిములతో నిండిపోయిన పరిస్థితి. ఊరికి నలుమూలల రోడ్ల పైన చెత్త చెదారం విస్తారంగా కనిపిస్తోంది.
పైగా ఇది సీజనల్ వ్యాదులు సోకే కాలం. రోగులు ఎక్కువ ఐతే సరిపడా సౌకర్యాలు లేవు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు బోథ్ అభివృద్ధి పై దృష్టి సారించాలని, చెత్తాచెదారం తొలగించి ప్రజలను ఆదుకోవాలి అని సామాజిక కార్యకర్త జక్కుల వెంకటేష్ వంటి వారు కోరుతున్నారు.