తెలంగాణలో షెడ్యూల్డ్ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ వర్గీకరణ మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఈ దిశగా సూచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కమిషన్ నివేదిక సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వానికి చేరింది.
ఇందుకోసం విస్తారంగా కసరత్తు జరిగింది.
షెడ్యూల్ కులాల్లోని విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక విషయాలతోపాటు పలు అంశాలపై 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని కమిషన్ అధ్యయనం చేసింది. మొత్తం ఎస్సీల్లో ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు? ఉప కులాల జనాభా ఎంత!? తదితర అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసింది.
కులాల వారిగా ఏయే గ్రూపుల్లో ఉంచాలనే అంశాన్ని పరిశీలించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 52.50 లక్షల మంది ఎస్సీలుండగా.. వీరిలో మాదిగలు 33.50 లక్షలు, మాలలు 19 లక్షల మంది ఉన్నారు. వీరిలో అక్షరాస్యత శాతం ఎంత!? విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఎంతమంది? ఉపకార వేతనాలను ఎంతమంది అందుకున్నారు? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ఎంతమంది పొందారనే వివరాలను కూడా సేకరించి, పరిశీలించింది.
దీంతోపాటు, ఎస్సీల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారనే వివరాలను కూడా సేకరించింది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపి దాదాపు 94 వేల మందికి పైచిలుకు ఉన్నట్టు ఆయా శాఖలు కమిషన్కు ఇచ్చిన రిపోర్టుల్లో తేలింది. ఇక ఎస్సీలకు రాజకీయ అవకాశాలపైనా వివరాలు సేకరించింది. గ్రామ, మునిసిపాలిటీల్లో వార్డు సభ్యుని నుంచి ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీ సహా ఇప్పటి వరకూ వారు రాజకీయ ప్రాతినిధ్యం వహించిన వివరాలను తీసుకుంది.
గతంలోలా ‘ఏ బీ సీ డీ’గా కాకుండా ఇప్పుడు ‘ఏ బీ సీ’ గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి సమర్పించిన తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
ఆయా గ్రూపుల్లో మాదిగ, మాల సహా మిగిలిన ఉప కులాల జనాభా శాతం, వాటికి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో దక్కిన అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను కేటాయించాలని నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం.
రెండు రోజుల్లో మాదిగ పోరాట సమితి ఆధ్వర్యంలో లక్ష డప్పులు కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి ముందుగానే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు ప్రారంభించింది.