కేరళలో సామాజికంగా విభిన్నమైన పరిస్థితి ఉంటుంది. సంఖ్యా బలంలో హిందువులదే మెజారిటీ అయినా క్రైస్తవులు, ముస్లింలు కూడా గణనీయంగా ఉన్నారు. కాబట్టే అక్కడ బిజెపి ఇంత వరకూ పాగా వేయలేకపోయింది. గత ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెల్చుకుంది. ఈసారి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అధికారంలోకి రావాలని ఆరాటపడుతోంది. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని కమలనాథులకు తెలుసు. అంఉకే కనీసం 40 సీట్లు సాధిస్తే రాజకీయ సమీకరణాలు మారుతాయనీ, ఎల్ డిఎఫ్, యుడిఎఫ్ లోని కొన్ని పార్టీలు తమ వూపు వస్తాయని బిజెపి నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా క్రైస్తవులకు చేరువ కావడానికి ప్రయత్నిస్తున్నారు.
బిజెపి నేతల ప్రయత్నాలకు తాజాగా ఒక సానుకూల సంకేతం అందింది. కేరళ క్రైస్తవుల్లో గణనీయ ప్రాబల్యం గల జాకొబైట్ చర్చి ఒక ప్రకటన చేసింది. తాము బిజెపి విషయంలో కూడా ఓపెన్ మైండ్ తో ఉన్నామనేది ఆ ప్రకటన సారాంశం. 2017లో సుప్రీంకోర్టు వెలువరించిన ఒక తీర్పు వల్ల జాకొబైట్ చర్చి కేరళలో పలు చర్చిలపై అధికారాన్ని కోల్పోయింది. వాటిపై ఆర్థొడక్స్ చర్చికి అధికారం సంక్రమంచింది. అయితే తాత్కాలికంగా రెండు వర్గా వారు ఒకే స్మశాన వాటికను వాడుకోవడానికి వీలుగా అఇకార ఎల్ డిఎఫ్ ప్రభుత్వం ఆ మధ్య ఒక ఆర్డినెన్స్ తెచ్చింది. దీంతో ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష కూటమికి జాకొబైట్ చర్చి మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో ఎల్ డిఎఫ్ మంచి విజయాలు సాధించింది. ఇప్పుడు తమకు ప్రయోజనం కలిగేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి బిజెపి సిద్ధపడితే దానికి మద్దతు ఇవ్వడంపై ఆలోచిస్తామని జాకొబైట్ చర్చి చెప్తోంది. దీనికి బిజెపి సై అనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎర్నాకుళం జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ చర్చి ప్రభావం చాలా ఎక్కువ. కాబట్టి వీరి మద్దతు పొందిన వారే గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. దీంతో బిజెపి నేతలు ఇప్పటికే సంప్రదింపులు మొదలుపెట్టారు. అవి ఫలిస్తే 12 సీట్లలో విజయంపై బిజెపి ఆశలు పెట్టుకోవచ్చని పరిశీలకులు చెప్తున్నారు.