చైనా గూఢచార నౌక Spy Ship Yuvan Wang 5 హంబన్ తోట పోర్ట్ కి ఈ రోజు చేరుకుంది. భారత్ తో పాటు అమెరికా కూడా హెచ్చరించినా,అభ్యంతరం పెట్టినా బలహీన స్థితిలో ఉన్న శ్రీలంక ప్రభుత్వం చైనా ఒత్తిడికి తలవొగ్గి చైనా నిఘా నౌకకి తమ దేశ దక్షిణ రేవు అయిన హంబన్ తోట పోర్ట్ లో లంగరు వేయడానికి అనుమతి ఇచ్చింది.
మరో వైపు కాల్ ఆఫ్ పోర్ట్ కింద పాకిస్థాన్ కి చెందిన చైనా తయారీ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ PNS తైమూర్ కూడా కొలంబో పోర్ట్ లో తిష్ట వేసింది!
గత వారం రోజులుగా దౌత్య వర్గాల ద్వారా భారత్ శ్రీలంక మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది ఎట్టి పరిస్థితులలోనూ చైనా నిఘా నౌక హంబన్ తోట పోర్ట్ లో లంగర్ వేయడానికి అనుమతి ఇవ్వవద్దు అంటూ. మొదట్లో భారత్ ఒత్తిడికి లొంగిన శ్రీలంక బీజింగ్ కి సందేశం పంపించింది హంబన్ తోట రేవుని మిలటరీ కోసం వాడకూడదు అనే నిబంధనని గుర్తు చేస్తూ! దానికి బదులుగా చైనా విదేశాంగ మంత్రి బదులిస్తూ యువాన్ వాంగ్ 5 అనే నౌక కేవలం సైంటిఫిక్ పరిశోధనకి ఉద్దేశించి తయారుచేసాము తప్పితే అది గూఢచర్యమ్ చేసే నౌక కాదు కాబట్టి హంబన్ తోట లీజు ఒప్పందం ప్రకారం యువాన్ వాంగ్ 5 నౌక హంబన్తోట రేవులో లంగరు వేయడానికి మాకు హక్కు ఉంది అంటూ !
మరో వైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి [IMF] నుంచి బెయిల్ అవుట్ పాకేజీ కోసం ఎదురుచూస్తున్న శ్రీలంక ప్రభుత్వం అదే IMF అమెరికా అజమాయిషీ కింద పనిచేస్తుందని తెలిసీ చైనా నిఘా నౌకాకి అనుమతి ఇవ్వడం అది ఈ రోజు హంబన్ తోట రేవుకి చేరుకోవడం జరిగింది. ఆగస్ట్ 11 న హంబన్ తోట రేవుకి రావాల్సిన షెడ్యూల్ ఎప్పుడో ఖరారు అయ్యింది కానీ భారత్ ఒత్తిడితో హిందూ మహా సముద్రంలోనే తన వేగాన్ని తగ్గించుకొని ప్రయాణం చేస్తూ వచ్చింది తప్పితే వెనక్కి వెళ్ళి మళ్ళీ రాలేదు. ఆగస్ట్ 11 నుండి ఆగస్ట్ 16 మధ్యలో బహుశా ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ పాకేజీ మీద శ్రీలంక చైనా ల మధ్య చర్చ జరిగి ఉండవచ్చు. అమెరికా అభ్యంతరాలని తోసిపుచ్చి యువాన్ వాంగ్ కి అనుమతి ఇస్తే ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ పాకేజీ ఇవ్వకపోతే అదే పాకేజీ తాను ఇస్తాను అని చైనా మాట ఇచ్చి ఉండవచ్చు. లేకపోతే ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒక వైపు భారత్ నుండి సహాయం తీసుకుంటూనే మరో వైపు అమెరికా నుండి హెచ్చరికతో కూడిన అభ్యంతరం వచ్చినా శ్రీలంక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక చైనా ఇచ్చిన హామీ ప్రధాన కారణం అయి ఉండవచ్చు.
యువాన్ వాంగ్ 5 నిఘా నౌక ప్రస్తుతం హంబన్ తోట రేవులో ఆగి ఉంది కాబట్టి అక్కడ నుండి 750 కిలోమీటర్ల పరిధిలో భారత భూభాగం పైన నిఘా పెట్టగల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ యువాన్ వాంగ్ 5 నిఘా నౌక దక్షిణ చైనా సముద్రం నుండి హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించి నేరుగా హంబన్ తోట కి వచ్చింది నెమ్మదిగా ప్రయాణిస్తూ !
ప్రస్తుతం అమెరికన్ నావీ కి చెందిన కార్గో షిప్ USNS CHARLES తమిళనాడులోని కట్టుపల్లి నౌకా కేంద్రమ్ లో ఉంది మరమ్మత్తుల కోసం. L&T కి చెందిన సంస్థ కట్టుపల్లి నౌకా కేంద్రంలో యుద్ధ నౌకాలతో పాటు హెవీ షిప్స్ కి సంబంధించిన మెయింటనెన్స్ పనులని నిర్వహిస్తుంది. క్వాడ్ ఒప్పందంలో భాగంగా అమెరికన్ నావీ L&T తో నిర్వహణ ఒప్పందం చేసుకుంది దానిలో భాగంగానే USNS CHARLES నావీ కార్గో షిప్ తమిళనాడుకి వచ్చింది.
శ్రీలంక ప్రభుత్వం పూర్తిగా చైనా అధీనంలోకి వెళ్ళిపోయింది ! ఆపద సమయంలో ఆదుకున్నది లేదు కానీ ఆ సమయంలో సహాయం చేసిన మన మాట కాదని చైనాకి వత్తాసు పలకడం వెనుక ఏదో తెలియని విషయం దాగున్నది. ఇప్పటికయినా భారత ప్రభుత్వం మేలుకొని ఇప్పటివరకు ఇచ్చిన లైన్ ఆఫ్ క్రీడిట్ చాలు ఈ రోజు నుండి ఇంకా మిగిలిఉన్న క్రెడిట్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి మీ చావు మీరు చావండి అని ఊరుకుంటే మేలు.
నిన్ననే ఒక అంతర్జాతీయ బ్లాగులో శ్రీలంక కి చెందిన ఒక వెధవ నిర్లజ్జగా చైనా ,పాకిస్థాన్ లని వెనకేసుకొచ్చాడు తప్పితే భారత్ ఇచ్చిన 5.4 బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ గురుంచి అడిగితే మీరు ఇచ్చిన దానిని ఐఎంఎఫ్ నుండి అప్పు రాగానే తీర్చేస్తాం మీ సహాయం మాకు అక్కరలేదు అంటూ వాగాడు. సదరు శాల్తీ బాగా చదుకున్నవాడే మరియు అంతర్జాతీయ విషయాల మీద బాగా అవగాహన ఉన్నవాడే! బహుశా శ్రీలంక ప్రభుత్వంలో ఉన్నత అధికారిగా పనిచేస్తూ పేరు మార్చుకొని మాతో వాగ్వివాదానికి దిగి ఉండవచ్చు. అయితే ఎవరో ఒక పనికిమాలిన వాడి అభిప్రాయాన్ని మొత్తం దేశానికి ఆపాదించవద్దు అని అంటారా ? వాడు పనికిమాలిన వాడు కాదు ఖచ్చితంగా శ్రీలంక ప్రభుత్వం లో ఉన్నత అధికారి అని స్పష్టమయింది కూడా ! బహుశా ఫారిన్ సర్వీస్ అధికారి అయి ఉండవచ్చు! వాడి భాష ని గుర్తుపట్టి నాతో పాటు ఇతర భారతీయులు కూడా నా అభిప్రాయాన్ని బలపరిచారు.
LTTE విషయంలో అప్పటి ప్రధాని రాజీవ్ తీసుకున్న అపరిపక్వ నిర్ణయాలు ఇప్పటికీ శ్రీలంక ప్రజలలో వాటి తాలూకు నీలి నీడలు వెన్నాడుతూనే ఉన్నాయని ఈ రోజు సదరు శ్రీలంక అధికారి వ్యాఖ్యలని బట్టి అర్ధమయింది!