ఆఫ్గనిస్తాన్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వేళ చైనాకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని…కశ్మీర్లో ముస్లింలకు మద్దతుగా నిలబడతామని తాలిబన్లు స్పష్టం చేశారు. చైనా నిర్మిస్తున్న వన్ బెల్ట్- వన్ రోడ్ కు సహకారం ఉంటుందని ఆప్ఘాన్ అధ్యక్షుడు బరాదర్ వెల్లడించారు.
ఇంకా పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఏర్పాటు పూర్తికాకముందే… ‘‘చైనా మా ప్రాధాన్య దేశం. ఆ దేశం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు… ‘వన్ బెల్ట్.. వన్ రోడ్” కు మేము సహకరిస్తాం. దీని వల్ల రోడ్లు, పోర్టులు, రైల్వేలు, ఇండస్ట్రియల్ పార్కులు అభివృద్ధి చెందుతాయి. అఫ్ఘాన్ పునర్నిర్మాణానికి చైనా పూర్తిగా సహకరించనుంది’’ అని తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్ వెల్లడించారు. కశ్మీర్లోని ముస్లింల తరఫున తాముంటామని… తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షాహీన్ ప్రకటించారు. అదే సమయంలో భారత్ తో సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు. ఇరాన్ తరహాలో ఇస్లామిక్ దేశంగా ఆఫ్గనిస్తాన్ ఉంటుందని… ముస్లిం దేశంగా ప్రపంచంలోని ముస్లింలందరి తరపునా తాము మాట్లాడతామని షాహీన్ అన్నారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోబోమని ముందు చెప్పిన తాలిబన్లు..ఇప్పుడు మాట మార్చారు. అటు.. కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడానికి తాలిబాన్లు తమకు సహకరిస్తారని పాక్ అధికార పార్టీ తహ్రీక్-ఎ-ఇన్సా్ఫ నేత నీలమ్ ఇష్రాద్ షేక్ ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. మరోవైపు పాక్, ఆఫ్గన్ నుంచి వస్తున్న ప్రకటనలపై భారత్ ఆచితూచి స్పందిస్తోంది. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా గురువారం అమెరికా విదేశాంగ మంత్రి అంటోని బ్లింకెన్, సహాయ మంత్రి వెండీషెర్మాన్తో సమావేశమయ్యారు. అఫ్ఘాన్ పరిణామాలు సహా, క్వాడ్ దేశాల సత్సంబంధాలపై ఆయన చర్చించారు.