చైనా మొబైల్ మార్కెట్ కష్టాలలో ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. మెయిన్ లాండ్ చైనా సహా విదేశాలకి ఎగుమతి చేసే జియోమీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు బాగా తగ్గాయి. లేటెస్ట్ డాటా ప్రకారం రెండో త్రైమాసిక అమ్మకాలు [స్మార్ట్ ఫోన్లు ] 14.7% పడిపోయాయి. ఇది వరుసగా గత 5 త్రైమాసిక అమ్మకాలతో పోలిస్తే ఎక్కువ అలా అని గత 5 త్రైమాసిక అమ్మకాలలో కూడా ఒక్కో త్రైమాసిక అమ్మకాలు క్రమంగా పడిపోతూ వస్తున్నాయని ఫైనాన్షియల్ పోస్ట్ తెలిపింది. పలు మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం చైనా మార్కెట్లు తీవ్ర నష్టాలలో ఉన్నాయి. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో 12,000/- విలువ చేసే చైనాకి చెందిన స్మార్ట్ ఫోన్లు భారత్ లో అమ్మడం మీద నిషేధం విధించబోతున్నారు అని. అయితే ఈ వార్త గత వారం రోజులుగా వైరల్ అవుతున్నా ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా ? అనే సందేహాలు కూడా ఉన్నాయి కానీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఈ వార్త మాత్రం బహుళ ప్రచారంలో ఉంది. అయితే గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలని జాగ్రత్తగా పరిశీలిస్తే మోదీ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే వార్తలో నిజం ఉండవచ్చు అనిపిస్తుంది. భారత్ ప్రపంచంలోనే స్మార్ట్ ఫోన్ల అమ్మకాలలో రెండవ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే చాలా వరకు స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జరిగేది 12,000 రూపాయాలలోపు ఉన్న స్మార్ట్ ఫోన్లు. ఇది చాలా పెద్ద మార్కెట్ చైనాకి. కానీ పన్నుల ఎగవేత లో ఇప్పటికే ప్రావీణ్యం సంపాదించింది చైనా. ఇప్పటికే చైనాకి చెందిన మొబైల్ ఫోన్ సంస్థలు VIVO, OPPO, HUAWEI ల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను శాఖలు దాడి చేసి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చాలా పకడ్బందీగా భారత ఉద్యోగుల ద్వారానే పన్ను ఎగవేసిన డబ్బుని చైనాకి తరలిస్తున్నాయి ఈ సంస్థలు. పన్ను ఎగవేతలో ప్రతిసారీ ఒక్కో కొత్త మార్గాన్ని కనిపెడుతున్నాయి ఈ సంస్థలు [భారత దేశపు చార్టెడ్ అకౌంటెంట్ల హస్తం కూడా ఉంది ] పన్ను ఎగవేత సొమ్ముని చైనాకి తరలించడానికి. VIVO, OPPO, HUAWEI లు మాతృ సంస్థలు అయితే వీటికి సబ్సిడరీ [అనుబంధ]లని స్థాపించి వాటి ద్వారా కూడా అక్రమ మార్గాల ద్వారా పన్ను ఎగవేత సొమ్ముని చైనాకి తరలిస్తున్నాయి. అయితే మన దేశంలో అశాంతిని రెచ్చగొట్టడానికి కూడా పన్ను ఎగవేసిన సొమ్ముని వాడుతున్నట్లు ఆధారాలు దొరికాయి. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పాలంటే ఏకంగా నిషేధం విధించడమే మేలని భారత ప్రభుత్వం భావిస్తుండవచ్చు. విచారణ పేరుతో కోర్టులలో సంవత్సరాల తరబడి కాలయాపన జరగడం చివరకి శిక్షలు పడే సమయానికి సూత్రధారులు చైనాకి వెళ్ళిపోవడం లాంటి వాటికి అవకాశం ఇచ్చేకన్నా నిషేధం మేలు అని కూడా భావించి ఉండవచ్చు.
మరోవైపు 12,000 రూపాయాలలోపు ధర వుండే స్మార్ట్ ఫోన్లని నిషేధించడం వలన భారతీయ బ్రాండ్లకి మళ్ళీ మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంతకుముందు ఉన్న భారతీయ బ్రాండ్ల ఫోన్ మార్కెట్ ని చైనా సంస్థలు పూర్తిగా ఆక్రమించుకున్నాయి. అయితే ఏవి భారతీయ బ్రాండ్లు ? అవి కూడా చైనా, తైవాన్, కొరియాల నుంచి స్పేర్ పార్ట్శ్ దిగుమతి చేసుకొని మన దేశంలోనే అసెంబుల్ చేసేవి గతంలో కాకపోతే పేరు వేరే వేరేవిగా ఉండేవి. ఆ మాటకొస్తే చైనాలోని ఫోన్లని తయారుచేసే సంస్థలు చాలా వరకు ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చర్ నుంచి కొనడమో లేదా ఆర్డర్ చేయడమో చేసి వాటికి తమ బ్రాండ్ పేరుని తగిలించుకొని అమ్ముతున్నాయి. చాలా కొద్ది సంస్థలు తమ స్వంత డిజైన్ డిపార్ట్మెంట్ ని కలిగి ఉన్నాయి.
విదేశాలకి ఎగుమతి చేయకపోయినా చైనా సంస్థలకి పెద్దగా నష్టం ఉండదు ఎందుకంటే చైనాలో వాటి అమ్మకాలు లాభాలలో ఉంటాయి ఎప్పుడూ. కానీ గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చైనా లో కూడా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు చాలా బాగా పడిపోయాయి. అయితే దీని మీద విశ్లేషకులు చెప్తున్నది ఏమిటంటే.. ఏదో ఒక త్రైమాసిక అమ్మకాలు పడిపోతే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కానీ గత 5 క్వార్టర్ ఫలితాలని చూస్తే మొదట సింగిల్ డిజిట్ లో అమ్మకాలు పడిపోవడంతో మొదలయ్యి అది కాస్త ఇప్పుడు డబుల్ డిజిట్ [14.7 %] కి చేరడం మాత్రం చైనా తీవ్ర సంక్షోభంలో ఉందని అర్ధమవుతుంది. జియోమీ,వివో,ఒప్పో బ్రాండ్ల అమ్మకాలు విపరీతంగా పడిపోయినట్లుగా తెలుస్తున్నది. అటు చైనా మార్కెట్లతో పాటు ఎగుమతులు కూడా అదే స్థాయిలో తగ్గిపోతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. దానికి తోడు ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే.. చైనాకి కష్టకాలం మొదలయినట్లే అంటున్నారు విశ్లేషకులు. భారత్ అతి పెద్ద మార్కెట్ చైనా స్మార్ట్ ఫోన్లకి.
చైనా మార్కెట్లలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పడిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.
1. జీరో కోవిడ్ పాలసీ వల్ల తరుచూ ఏదో ఒక ముఖ్య నగరంలో కనీసం నెల రోజుల పాటు లాక్ డౌన్ ఉంటున్నది గత సంవత్సర కాలంగా. దాంతో ఆయా ప్రాంతాలలో ఉండే అన్ని ఫాక్టరీలు మోసేయాల్సి వచ్చింది, ఇది గత సుదీర్ఘ లాక్ డౌన్ కి అదనం. లాక్ డౌన్ ల వల్ల ఉత్పత్తి పడిపోవడం దాంతో ప్రజల ఆదాయం పడిపోవడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది.
2. కోవిడ్ కి ముందు స్మార్ట్ ఫోన్ జీవిత కాలం కేవలం రెండేళ్లుగా ఉండేది చైనాలో అంటే ప్రతి రెండేళ్ళు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో తమ పాత ఫోన్లని అమ్మేసి కొత్త ఫోన్లని కొనేవారు కానీ జీరో కోవిడ్ పాలసీ వల్ల నిత్యం లాక్ డౌన్ లు ఉండడం వలన ఇప్పుడు పాత ఫోన్లు అమ్మేసి కొత్త ఫోన్లు కొనే వాళ్ళు బాగా తగ్గిపోయారు.
కోవిడ్ కి ముందు చైనాలో ఎక్కడయినా బ్యాంకులలో అక్రమాలు జరిగితే వాటిని మూడు నెలల్లోపే పరిష్కరించి బయటి ప్రపంచానికి తెలియనిచ్చేది కాదు అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం. కానీ హేనాన్ ప్రావిన్స్ లోని మూడు గ్రామీణ బ్యాంకులలో జరిగిన అక్రమాల మీద ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకోలేకపోయింది అక్కడి సెంట్రల్ బ్యాంకు. అంటే చైనా బ్యాంకింగ్ వ్యవస్థ నగదు కొరతతో బాధపడుతున్నది. అందుకే హేనాన్ ప్రావిన్స్ లో యుద్ధ టాంకులతో విన్యాసాలు జరిపి ఆందోళనకి దిగిన ప్రజలని భయభ్రాంతులకి గురుచేస్తున్నది ప్రభుత్వం. వేల కోట్ల యువాన్ల ప్రజల సొమ్ము బాంకులలో ఇరుక్కుపోయి వాటిని వాడుకునే వీలులేకపోయింది. ఇది హేనాన్ ప్రావిన్స్ మాత్రమే కాకుండా మొత్తం చైనా లోని ప్రావిన్స్ లలోని ప్రజలు ఆన్ లైన్ ద్వారా తమ సొమ్ముని గ్రామీణ బాంకులలో డిపాజిట్ చేసి ఇరుక్కుపోయారు. ఇది కూడా చైనా లో ఆర్ధిక మాంద్యానికి దారి తీసింది.
చైనాలో ఆర్ధిక మాంద్యం తాలూకు ఫలితాలు ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచానికి తెలుస్తున్నది. ముందు అది స్మార్ట్ ఫోన్ల ఎగుమతల మీద చూపించింది. ఇప్పుడు ఏకంగా చైనా మార్కెట్ల మీద చూపిస్తున్నది. గత 10 సంవత్సరాలుగా చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలు తమ అమ్మకాలతో విపరీతమయిన లాభాలని ఆర్జించాయి కానీ కోవిడ్ వల్ల అవి ఆవిరి అయిపోయాయి. ఇప్పుడు భారత్ కనుక నిషేధం విధిస్తే అది వాటికి చావు దెబ్బ అవుతుంది.
చైనాను దెబ్బ తీయడానికి ఇదే మంచి సమయం. బహుశా 12 వేల లోపు అమ్మే స్మార్ట్ ఫోన్ల స్థానంలో మన దేశపు బ్రాండ్లని అమ్మడానికి అంతా సిద్ధం చేసి అప్పుడు చైనా ఫోన్ల మీద నిషేధం విధించవచ్చు.
~ పార్ధసారధి పోట్లూరి