ప్రజాస్వామ్యంపై వర్చువల్ సమ్మిట్కు చిన్న చిన్న దేశాలనూ ఆహ్వానించిన అమెరికా చైనాను మాత్రం పిలవలేదు. తైవాన్ సహా 110 దేశాలను ఆహ్వానిస్తే అందులో చైనా, టర్కీ మాత్రం లేవు. ఇక మిడిలీస్ట్ నుంచి ఇరాక్, ఇజ్రాయెల్ దేశాలు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్ ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా యూఎస్ మిత్ర అరబ్ దేశాలూ అందులో లేవు.
డిసెంబర్ 9,10 వ తేదీల్లో ఈ వర్చువల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ప్రధాన పాశ్చాత్య దేశాలు, భారత్, ఇజ్రాయెల్, ఆఫ్రికా దేశాలు, తైవాన్ ను జాబితా చేర్చి చైనాను మాత్రం చేర్చలేదు. సమ్మిట్లో పాల్గొనే దేశాల జాబితాను తన వెబ్ సైట్ లో విడుదల చేసింది ఆ దేశ విదేశాంగశాఖ. ఆఫ్రికా నుంచి , నైజీరియా, దక్షిణాఫ్రికా మరియు నైజర్తో సహా ఇంకా పలుదేశాలున్నాయి. భారత ఉపఖండంలో భారత్ పాకిస్తాన్ లున్నాయి. నాటో దేశమైన టర్కీకి కూడా ఆహ్వానం లేదు.
ఈ ఏడాది ఆగస్టులో సమ్మిట్ను ప్రకటించింది అమెరికా. నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, మానవహక్కుల్ని గౌరవించడం, అవినీతిపై పోరాటం సమ్మిట్ ప్రధాన ఎజెండా. స్వదేశంలో , విదేశాలలో ప్రజాస్వామ్యం ,మానవ హక్కులను రక్షించడానికి కట్టుబాట్లు, సంస్కరణలకోసం ఇది వేదికవుతుందని వైట్ హౌస్ తెలిపింది.
బైడెన్ అధ్యక్షడు అయిన తరువాత చైనాతో అమెరికా సంబంధాలు మెరుగుపడతాయని అందరూ అనుకున్నారు.కానీ పరిణామాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. 2022లో జరగనున్న బీజింగ్ ఒలింపిక్స్ను అమెరికా బహిష్కరించవచ్చనే వార్తలూ వచ్చాయి. చైనాకు ప్రతినిధి బృందాన్ని పంపకూడదని నిర్ణయించినట్టు తాజాగా వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది. అయితే అథ్లెట్లు ఆటలలో పాల్గొంటారు కానీ యూఎస్ అధికారిక ప్రతినిధి బృందం,దేశ నాయకులు మాత్రం వేడుకకు హాజరుకావడం లేదు.