కేరళలో మారుతున్న రాజకీయం.. కమలం గూటికి హైకోర్టు మాజీ జడ్జి..
కేరళలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి షాకిచ్చేలా కమలం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖులు బీజేపీ గూటికి చేరుతుండటంతో పినరయ్ సర్కార్కు ఈ సారి పరాజయం తప్పదన్నట్లు కన్పిస్తోంది. గతంలో ఒక్క సీటు మాత్రమే గెలిచిన బీజేపీ.. ఈ సారి త్రిపురలో గెలిచినట్లుగా కేరళలో కమలం జెండాను రెపరెపలాడించాలని ఉవ్విల్లూరుతోంది. అందుకు తగ్గట్లుగానే ప్రచారంలో దూసుకెళ్తుంది. ఇప్పటికే పలువురు కమ్యూనిస్టు నేతలు కమలం గూటికి చేరుకున్నారు. ఇక ప్రముఖ వ్యక్తి మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు మాజీ జడ్జ్ పీఎన్ రవీంద్ర కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో బీజేపీలో చేరారు.దీంతో రాష్ట్ర బీజేపీకి మరింత బలం చేకురిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో ఒకే దశలో ఎప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.