‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా సొంత నియోజకవర్గం కుప్పం వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబుకు పార్టీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పోలీసుల ఆంక్షలను చేధించుకుంటూ వచ్చిన వందలాదిమంది ఆంధ్ర-కర్నాటక సరిహద్దు గ్రామం శాంతిపురం మండలం జేపీకొత్తూర్ దగ్గర స్వాగతం పలికారు. వారందరినీ చూసి చంద్రబాబు వాహనం బయటికి వచ్చి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అదే సమయంలో చంద్రబాబు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు నోటీసులు తీసుకుని వచ్చారు. అయినా శ్రేణులు వెనక్కి తగ్గలేదు. చంద్రబాబుకు నినాదాలతో స్వాగతం పలికారు. కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు గాయపడ్డారు. కుప్పంలో ఆయన రోడ్ షోకు అనుమతి లేదంటూ అంతకుముందే పోలీసులు ఆయన ప్రచార రథాన్ని సీజ్ చేశారు. అయితే ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా పర్యటన ఆపేదిలేదంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి వస్తుంటే అనుమతేంటని పార్టీప్రశ్నిస్తోంది. ఇటీవలి చంద్రబాబు సభల్లో తొక్కిసలాటలో పలువురు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన ప్రచారరథాన్ని సీజ్ చేశారు పోలీసులు.