ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగుదేశం జనసేన బిజెపి కూటమికి చెందిన ఎమ్మెల్యేలు అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశ ప్రాంగణం అంతా కొత్త ఎమ్మెల్యేలతో పూర్తిగా నిండిపోయింది. అన్ని వైపులా తరిచి చూస్తే కూటమి ఎమ్మెల్యేలతో ప్రాంగణం కళకళలాడుతుండగా .. చంద్రబాబు కళ్ళు చెమర్చాయి . కొంతసేపు చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు . ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తూ కీలక ప్రసంగం చేశారు.
చంద్రబాబు ప్రసంగం ఆయన మాటల్లోనే…
ఎన్నికల్లో 93 శాతం గెలవడం దేశ చరిత్రలో అరుదైన అనుభవం. ఎన్నికల్లో 57 శాతం ఓట్లతో ప్రజలు ఆశీర్వదించారు. ఫ్రజల తీర్పుతో మనందరిలో మరింత బాధ్యత పెరిగింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ గెలుపొందింది . బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 సీట్లు గెలుపొందింది. ప్రజలు ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీలో అందరూ గౌరవించారు. ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట, గౌరవం పెరిగింది -.పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేను
నేను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు.
నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్నా . మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నా . కార్యక్రమానికి మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారు. సమిష్టిగా పరజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది . 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా . ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని ముందుకెళ్లాం. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. పేదల జీవితం మార్చేందుకు అందరూ కష్టపడదాం. రాష్ట్రం పూర్తిగా శిధిలమైంది . ఓటర్లు ప్రవర్తించిన తీరు రాష్ట్ర చరిత్రలో నిలుస్తుంది. పదవి వచ్చిందని విర్రవీగితే ఇదే పరిస్థితి వస్తుంది. తప్పు చేసిన వారిని క్షమిస్తే అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. విధ్వంస, కక్షా రాజకీయాలను ప్రక్షాళన చేయాలి. నా కుటుంబానికి అవమానం జరిగింది . గౌరవ సభ కాదు.. కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చా. ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి అడుగుపెడతానని చెప్పా . నా శపథాన్ని ప్రజలు గౌరవించారు.. గౌరవించిన ప్రజలను నిలబెట్టాలి .
పోలవరం పనులు 72 శాతం పూర్తి చేశాం . పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకపోయింది . కేంద్ర సహకారంతో పోలవరం పూర్తి చేస్తాం . నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తాం. వ్యవసాయ రంగం స్థిరత్వానికి కృషి చేస్తాం . రాష్ట్రం సంక్షోభంలో ఉంది.. రైతులు అప్పుల పాలయ్యారు . పదేళ్ల తర్వాత రాజధాని ఏమిటంటే చెప్పుకోలేని పరిస్థితి . కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా వెళ్లాలి. ప్రజావేదిక మాదిరిగా కూల్చివేతలు ఉండవు. మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదు. అమరావతి రాజధానిగా ఉంటుంది . విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందాం. గతంలో సీఎం వస్తే చెట్లు కొట్టివేత, షాపుల బంద్ జరిగేది. గతంలో సీఎం వస్తే పరదాలు కట్టడం వంటివి జరిగేవి. నేను మామూలు మనిషిగానే వస్తా.. అందరితో కలిసి ఉంటా . మేమందరం సామాన్య వ్యక్తులుగానే మీ వద్దకు వస్తాం. హోదా అనేది సేవ కోసం తప్ప.. పెత్తనం కోసం కాదు . సీఎం వస్తే ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆదేశాలిచ్చా. ఏ ఒక్కరి ఆత్మగౌరవానికి భంగం కలగకూడదు. ప్రజాహితం కోసం పనిచేస్తాం . ప్రతి నిర్ణయం.. ప్రతి అడుగు ప్రజల కోసమే .. స్టేట్ ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తాం. తప్పులు జరిగితే సలహాలు ఇచ్చే విధానం నెలకొల్పుతాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా సాగాలి . ప్రపంచ దేశాల్లో భారత్ నంబర్ వన్ గా తయారు కావాలి. 2047 నాటికి భారత్ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రపంచంలో భారతీయులు నంబర్ వన్ గా ఉండాలి. తెలుగుజాతి ప్రపంచంలో నంబర్ వన్ గా ఉండాలి .
అని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.
ఈ సమావేశంలో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ఉమ్మడి నాయకుడిగా చంద్రబాబు ని ఎన్నుకొన్నారు . అనంతరం మూడు పార్టీల నాయకులు కలిసికట్టుగా గవర్నర్ ను కలిసారు. కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నాయకుడిగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆయన్ని కోరారు. బుధవారం నాడు లాంఛనంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం తో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతుంది.