చాయ్ పే కుట్ర” పై ప్రధాని మోదీ ఆగ్రహం
అంతర్జాతీయ వేదికగా భారత తేయాకు పరిశ్రమను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం పర్యటనలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కుట్ర చేస్తున్న వారిపై తేయాకు కార్మికులు తప్పకుండా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధి పథకం “అసోం మాల”ను ప్రారంభించారు. అంతేకాదు మరో రెండు వైద్య కళాశాలలకు కూడా శంకుస్థాపనలు చేశారు. తేయాకు తోట సాగులో అసోం ప్రముఖ స్థానంలో ఉంటుందన్న ఆయన.. దేశం వెలుపల భారత తేయాకు పరిశ్రమలపై కుట్రలు జరుగుతున్నాయన్నారు. పరోక్షంగా ఎన్జీవో “గ్రీన్పీస్” నివేదికను ఉద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లోని తేయాకు తోటల్లో ఎరువులను అధికంగా వినియోగిస్తున్నారని గ్రీన్పీస్ సంస్థ ఓ నివేదికలో ఆరోపించింది. ఇలాంటి దాడులను భారత తేయాకు పరిశ్రమల కార్మికులు సహించరంటూ మండిపడ్డారు. కాగా, ప్రధాని మోదీ ఇటీవల అసోంలో పర్యటించడం రెండో సారి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ వరుస పర్యటనలు చేయడం విశేషం.