కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా యూజర్లపై నజర్ పెట్టింది. ఇకపై తప్పుడు వార్తలను వ్యాపింపజేస్తూ హింసను ప్రేరేపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ప్రకటించారు. ఇటీవల ట్విట్టర్ సంస్థతో నెలకొన్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాను తాము గౌరవిస్తామని.. ప్రజలకు అధి సాధికారత కల్పించిందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సోషల్ మీడియాది కీలకపాత్ర అని.. అయితే అదే సమయంలో తప్పుడు వార్తలను వ్యాపింపజేస్తూ.. హింసను ప్రేరేపించాడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని రాజ్యసభ వేదికగా మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు.
అంతేకాదు.. ట్విట్టర్తో పాటుగా.. ఫేస్బుక్,యూట్యూబ్,లింక్డిన్ల పేర్లను కూడా ఆయన స్పెషల్గా ప్రస్తావించారు. మీకు భారత్లో కోట్లాది మంది ఫాలోవర్లు ఉన్నారు. మీరు ఇక్కడ స్వేచ్చగా వ్యాపారం చేసుకుంటూ.. డబ్బును సంపాదించుకోవచ్చని.. కానీ మీరు తప్పనిసరిగా భారత రాజ్యాంగాన్ని అనుసరించాల్సిందేనని రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సోషల్ మీడియా దుర్వినియోగంపై మాట్లాడుతూ మంత్రి ఈ హెచ్చరికలు చేశారు.