రైతుల జీవితాలతో అధికార టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీలు చెలగాటం ఆడుతున్నాయని మండిపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రంతో కేసీఆర్ చేసుకున్న ఒప్పందం రైతులకు శాపంగా మారిందన్నారు. ఒక్క సంతకంతో తెలంగాణలోని అన్నదాత నుదుట ముఖ్యమంత్రి మరణశాసనం రాశారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు పక్కకుపెట్టి కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. 50 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు కోసం 10 వేల కోట్లు ఖర్చు అవుతాయని.. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ కి తిరిగి ఇవ్వటం ద్వారా రాష్ట్రానికి 12 వేల కోట్లు వస్తాయని అన్నారు. ఈ పరిస్థితిని ఆసరా చేసుకుని దళార్లు రెచ్చిపోతున్నారని… తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్న దళారులు, మిల్లర్లపై పీడీయాక్టులు ఎందుకు పెట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు.
డ్రగ్స్ కేసులో తన కుటుంబసభ్యులను కావాలని ఇరికిస్తున్నారనీ రేవంత్ ఆరోపించారు.పిల్లలను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం చేయడం తగదన్నారు. తన మేనల్లుడు డ్రగ్స్ తీసుకున్నాడంటున్నారు…అతని శాంపిల్స్ పంపించేందుకు సిద్ధం…మరి కేసీఆర్ తన కొడుకును శాంపిల్స్ తీసుకోవడానికి పంపిస్తాడా అని సవాల్ విసిరారు పీసీసీ చీఫ్.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)