సర్వీస్ ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం రెస్టారెంట్లను హెచ్చరించింది. ఈ విషయంపై చర్చించడానికి జూన్ 2 న నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) తో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. “రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జ్ అనేది వినియోగదారుల ఇష్టానుసారం ఇవ్వాల్సి ఉంటుంది, అందులో ఎలాంటి బలవంతం ఉండదు. అలా తప్పనిసరి కానప్పటికీ, డిఫాల్ట్గా రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తున్నాయని” వినియోగదారుల వ్యవహారాల విభాగం కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ NRAIకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ సమస్య రోజువారీ ప్రాతిపదికన వినియోగదారులను పెద్దగా ప్రభావితం చేస్తుంది, వినియోగదారుల హక్కులపై గణనీయమైన మార్పులను కలిగిస్తుంది. కాబట్టి దానిని నిశితంగా పరిశీలించాల్సిన అవసరముందని డిపార్ట్మెంట్ భావించింది.
కన్స్యూమర్ అఫైర్స్,ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో, సర్వీస్ ఛార్జీల చట్టబద్ధతపై వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని, బిల్లుల నుంచి వాటిని తీసివేయమని అభ్యర్థిస్తే వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంది.
దీనికి సంబంధించి రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జీలను తప్పనిసరి చేయడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సర్వీస్ ఛార్జ్ వినియోగదారుల ఇష్టానుసారం ఇవ్వాల్సి ఉండగా, బలవంతంగా వేరే ఇతర చార్జీల తోపాటు సర్వీస్ చార్జీని వసూలు చేయటం.. ఒకవేళ దాన్ని వినియోదారు ప్రశ్నిస్తే వారిని ఇబ్బంది పెట్టడంపై చర్చలు జరపనున్నారు.
ఏప్రిల్ 2017లో జారీ చేయబడిన మార్గదర్శకాల ప్రకారం, ఒక కస్టమర్ రెస్టారెంట్లోకి ప్రవేశించినంత మాత్రాన అతని నుంచి సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడం తప్పనిసరి కాదు. రెస్టారెంట్లోకి ప్రవేశిస్తే సర్వీస్ ఛార్జ్ సేకరిస్తే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ను ఉల్లంఘించడమే అవుతుంది. రెస్టారెంట్లు సగటున సర్వీస్ ఛార్జీలుగా 5% నుంచి 10% వరకు వసూలు చేస్తున్నాయి.