జమ్మూ-శ్రీనగర్ హైవేపై రాంబన్లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటనలో దర్యాప్తుకోసం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది కేంద్రం. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించి.. నివారణ చర్యలను సూచించడంతోపాటు సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వనుంది ప్యానెల్. అది కూలిపోవడానికి గల కారణాలను, వాటి పరిష్కార చర్యలను పరిశోధించడానికి ఇప్పటికే స్థలానికి వెళ్లి చూసారు నిపుణులు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఐఐటీ ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ జేటీ సాహు ఈ కమిటీకి ఛైర్మన్గా వ్యవహరిస్తారు. కమిటీ 10 రోజుల్లో మంత్రిత్వ శాఖకు నివేదికను సమర్పించనుంది.
రాంబన్ బనిహాల్ సెక్షన్లోని డిగ్డోల్, ఖూని నల్లా మధ్య ప్రాంతంలో నేల పెళుసుగా ఉండడం వల్ల.. తరచుగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాంబన్ బనిహాల్ విభాగంలో మూడు ప్యాకేజీల కింద సొరంగాలు ప్రతిపాదించారు. జమ్మూ శ్రీనగర్ హైవేపై డిగ్డోల్ నుంచి పాంథియాల్ వరకు నాలుగు లేనింగ్లో ట్విన్ ట్యూబ్ టన్నెల్ పనిని పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ సహా సిగల్ ఇండియా లిమిటెడ్కు అప్పగించారు. నిర్మాణ పనులు ఫిబ్రవరి 2022లో ప్రారంభమయ్యాయి.అయితే మే 19న రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం ప్రారంభమైంది. కార్మికులను బయటకు తరలించడానికి ముందు, అకస్మాత్తుగా ఒక భారీ రాయి స్టీల్ పోర్టల్ పైన పడిపోయింది, దాంతో 12 మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోయారు. సీనియర్ NHAI అధికారులు వెంటనే స్థలానికి చేరుకున్నారు. SDRF, NDRF సహా J&K పోలీసులు వెంటనే రెస్క్యూ పనిని ప్రారంభించారు. ఇద్దరు కార్మికులను రక్షించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అడపాదడపా రాళ్లు విరిగి పడటం, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయకచర్యలకు ఆటంకం ఏర్పడింది. అందులో 12 మంది చిక్కుకున్నారని భావిస్తుండగా 10మంది మృతదేహాలను రెండురోజుల తరువాత వెలికితీశారు.
ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు 15 లక్షల వరకు ఇపిసి కాంట్రాక్టర్ ద్వారా వర్క్మెన్ పరిహారం, 2 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు. గాయపడిన వారికి కూడా తగిన పరిహారం అందజేస్తున్నారు. అదనంగా, యూనియన్ టెర్రిటరీ అడ్మినిస్ట్రేషన్ కూడా రూ. 1 లక్ష ఎక్స్గ్రేషియా రిలీఫ్ను ప్రకటించింది. పనులు జరుగుతున్న కారణంగా ఈ ఘటన జరిగిందా లేక సహజ కారణాల వల్ల జరిగిందా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఇటువంటి అత్యవసర పరిస్థితులను నిర్వహించడానికి ఇప్పటికే ప్రక్రియను ప్రారంభించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది.