దాణా కుంభకోణం ఐదో కేసులోనూ లాలూప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చింది సీబీఐ స్పెషల్ కోర్టు. దొరండా ట్రెజరీ నుంచి 139 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్ కేసులో ఆయనే దోషిగా నిర్ధారణ అయింది. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం పెరోల్ మీద బయట ఉన్న లాలూ మళ్లీ జైలుకు వెళ్లక తప్పని స్థితి.
తీర్పు వెలువడే సమయానికి లాలూ కోర్టులోనే ఉన్నారు. ఉమ్మడి బిహార్ కు సీఎంగా పనిచేసిన కాలంలో 1996లో ఈ స్కాం వెలుగుచూసింది. మొత్తం 950 కోట్ల కుంభకోణం ఇది. 1991 నుంచి 1996 మధ్య కాలంలో ఆ మొత్తం సొమ్మును తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సీబీఐ సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఆయన్ని నిందితుడిగాపేర్కొంటూ ఐదు కేసులు నమోదు చేసింది. దాణా స్కాంకు సంబంధించి ఇతర నాలుగు కేసుల్లోనూ లాలూ దోషిగా తేలారు. శిక్ష కూడా అనుభవిస్తున్నారు. అనారోగ్య కారణాలతో పెరోల్ పై విడుదలైన ఆయన మరో కేసులోనూ దోషిగా తేలారు. దొరండా ట్రెజరీ కేసు స్కాంలో ఐదోది.
దొరండా ట్రెజరీ నుంచి అక్రమంగా నిధులు కాజేసినట్టు రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. లాలూతో పాటు 98 మంది నిందితులూ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.