కారు.. రివర్స్ గేరు?
దుబ్బాక దెబ్బ గట్టిగానే తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ లో గూబ గుయ్యిమన్నది. బిజెపి ధాటికి టిఆర్ ఎస్ కు దెబ్బమీద దెబ్బ పడింది. తదుపరి ఖమ్మం, వరంగల్ నగర పాలక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటడానికి సంజయ్ బండి రయ్యిమని దూసుకుపోతున్నది. ఆ దూకుడుతో కారుకు బ్రేక్ పడుతుందా అనే అనుమానాలు పెరిగాయి. అందుకేనేమో, ఆ రెండు నగరాల్లో ఎన్నికలను మూడు నెలలు వాయిదా వేయాలని కెసిఆర్ సర్కార్ భావిస్తున్నది అని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఆ నగరాల్లో డీలిమిటేషన్ చేయాలంటే ఇప్పటికే ప్రాసెస్ మొదలు పెట్టి ఉండాల్సింది. అలా కాకుండా ఎన్నికలను వాయిదా వేసి, స్పెషలాఫీసర్ల జమానాలో డీలిమిటేషన్ చేస్తారనేది మీడియా కథనాల సారాంశం.
కమలం పార్టీ కసిగా ఉంది. కెసిఆర్ పార్టీకి కోలుకోలేని దెబ్బతీయాలంటూ బండి సంజయ్ బృందం కదం తొక్కుతున్నది. ఈ జోరు ఇలాగే కొనసాగితే కష్టమనేది గులాబీ క్యాడర్ లో వినిపిస్తున్న మాట అనేది కూడా పలు సోషల్ మీడియా పోస్టుల సారాంశం. దుబ్బాకలో బిజెపి గెలిచిన తర్వాత ఇక ఆ ఆర్టీకి భాగ్యనగరంలో ఎక్కువ సమయం ఇవ్వద్దని ఆగమేఘాల మీద జిహెచ్ ఎంసి ఎన్నికలు పెట్టించారు. ఆ వ్యూహం బూమరాంగ్ లా తిప్పికొట్టింది. గులాబీ ప్లాన్ అట్టర్ ఫ్లాపైంది. ఇప్పుడు ఖమ్మం, వరంగల్లో ఎన్నికలను వాయిదా వేసినంత మాత్రం బిజెపి బలహీన పడుతుందా? నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఎప్పుడు జరగాలనేది టిఆర్ ఎస్ చేతిలో లేని విషయం. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ఎన్నిక జరుపుతుంది. బహుశా ఏప్రిల్లో ఆ ఎన్నిక జరగవచ్చు. టిఆర్ ఎస్ టికెట్ కోసం నోముల నర్సింహయ్య కుటుంబం, స్థానిక నేతల మధ్య గట్టి పోటీ కనిపిస్తున్నది. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు అప్పుడే ప్రచారం, వ్యూహ రచన కూడా మొదలుపెట్టాయి. ఆ ఫలితం ఎలా ఉన్నా ఖమ్మం, వరంగల్ ఎన్నికలను వాయిదా వేయడం అనే వ్యూహం ఫలిస్తుందా లేక వికటిస్తుందా అనేది టిఆర్ ఎస్ శ్రేణులకు అంతుపట్టడం లేదు.