కేంద్ర ప్రభుత్వానికి నీట్ పరీక్ష తలనొప్పులు తెస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ డెంటల్ కోర్సులలో ప్రవేశానికి కొంతకాలంగా నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అంతకుముందు ఆయా రాష్ట్రాల్లో విడివిడిగా ప్రవేశ పరీక్షలు జరిగేవి. కానీ వివిధ రాష్ట్రాల్లో ప్రవేశం ఆశించే విద్యార్థి నాలుగైదు పరీక్షలు రాయాల్సి వస్తోంది,, కాబట్టి ఈ భారాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష పెడతామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది అప్పటినుంచి దఫా దఫాలుగా నీట్ పరీక్ష అమలవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మెడికల్ డెంటల్ కోర్సుల ప్రవేశాలు పూర్తిగా నీట్ ర్యాంకుతోనే జరుగుతున్నాయి.
నీట్ పరీక్ష ర్యాంకింగ్ మీద కొంతకాలంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏడాది ఈ అనుమానాలు మరింత పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. ఒకే ప్రవేశ పరీక్షా కేంద్రంలో ఎక్కువమందికి ఉన్నత ర్యాంకులు రావడం,, ఒకే ర్యాంకు ఎక్కువ మందికి తీసుకోవడం వంటివి బట్టబయలు అయ్యాయి. దీంతో నీట్ ప్రవేశ పరీక్ష నాణ్యత మీద అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పుడు ఈ అంశము సుప్రీంకోర్టు ముంగిటకు చేరింది. నీట్-యూజీ పరీక్షలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పరీక్ష ప్రశ్నాపత్రం లీక్, అక్రమాలపై హితెన్ సింగ్ కశ్యప్తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. ఇది 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయమని, సీబీఐ విచారణ జరిపించాలని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టును కోరారు.
అయితే, ఈ విషయాన్ని తాము అర్థం చేసుకున్నామని, అన్ని అంశాలు తమ దృష్టిలో ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. ఈ సందర్భంగా నీట్ పరీక్ష శిక్షణకు కేంద్రంగా ఉన్న రాజస్థాన్లోని కోటాలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలను న్యాయవాది ప్రస్తావించగా కోర్టు అడ్డుకుంది. అనవసరమైన భావోద్వేగ వాదనలు చేయవద్దని, నీట్ ఫలితాల వల్ల కోటాలో ఆత్మహత్యలు జరగడం లేదని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. సీబీఐ విచారణ జరిపించడంపై స్పందనను తెలియజేయాల్సిందిగా కేంద్రం, ఎన్టీఏతో పాటు సీబీఐ, బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు రెండు వారాల గడువు ఇచ్చింది.
సహజంగానే ఈ అంశం మీద కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు ఎక్కుపెడుతోంది.
నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కాకపోతే బీహార్లో 13 మందిని పేపర్ లీక్ చేశారని ఎందుకు అరెస్టు చేశారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రాన్ని ప్రశ్నించారు. పేపర్లు ఇచ్చిన ముఠాకు రూ.30 – రూ.50 లక్షలు అందిన వైనాన్ని పట్నా పోలీసులు బయటపెట్టలేదా అని అడిగారు. గుజరాత్లోని గోద్రాలోనూ నీట్-యూజీ చీటింగ్ రాకెట్ పట్టుబడలేదా? అని ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఏ ద్వారా నీట్ కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం మోదీ ప్రభుత్వం చేస్తున్నదని ఆరోపించారు.
కాగా ప్రతిపక్షాల విమర్శలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి మాల్ప్రాక్టీస్ను, అక్రమాలను తమ ప్రభుత్వం ఉపేక్షించబోదని, ఎన్టీఏ జవాబుదారీతనానికి సంబంధించి ఏమైనా లోపాలు గుర్తిస్తే సరిదిద్దుతామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం పేర్కొన్నారు. ఈ ఏడాది సిలబస్ తక్కువ కావడం, అభ్యర్థుల సంఖ్య పెరగడం వల్ల పోటీ పెరిగిందని, టాప్ ర్యాంకర్లు పెరిగారని ఆయన స్పష్టత ఇచ్చారు.
ఇక్కడే మరొక విషయం కూడా గమనించాలి. మొదటి నుంచి నీటి పరీక్షను దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నీట్ ప్రవేశ పరీక్షను ఇంగ్లీషు హిందీ భాషలలో నిర్వహించడం వలన ఉత్తరాది హిందీ రాష్ట్రాల విద్యార్థులు బాగా లబ్ధి పొందుతున్నారు దక్షిణాది ప్రాంతీయ భాషలలో పరీక్ష లేకపోవడంతో కచ్చితంగా ఇంగ్లీషులోనే రాయాల్సి ఉండడం గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను ఇబ్బంది పెడుతోంది అందుచేత నీట్ పరీక్షను తొలగించాలని దక్షిణాది రాష్ట్రాలు కోరుతున్నాయి. నీట్ పరీక్షలో భారీ స్కాం కు అవకాశం ఉందని, దీనిని బలంగా వ్యతిరేకించాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. నీట్ అనేది ఒక స్కాం అని తమిళనాడు మొదటే చెప్పిందని, ఇప్పుడు దేశమంతా చెప్తున్నదని ఆయన అన్నారు.
మొత్తం మీద నీట్ పరీక్ష పేరుతో జరుగుతున్న గందరగోళం కేంద్ర ప్రభుత్వానికి చికాకును తెప్పిస్తుంది. వ్యవస్థలోని కొందరు లంచగొండులు చేస్తున్న నిర్వాకంతో … ప్రభుత్వ పెద్దలు జవాబు చెప్పుకోవాల్సి వస్తోంది. దీంతో అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.