తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు పిటిషన్ పై హైకోర్ట్ కీలకతీర్పు ఇచ్చింది. సీసీఎస్ నోటీసులపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఈనెల 8న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావాలని సునీల్ ను ఆదేశించింది. అయితే సునీల్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని న్యాయస్థానం తెలిపింది. విచారణకు సునీల్ కనుగోలు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది.
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 సీఆర్పీపీసీ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై హైకోర్టులో సుదీర్ఘ వాదనల తర్వాత ఈరోజు కీలక తీర్పును వెల్లడించింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 నోటీసులను సమర్ధించింది.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశపూర్వకంగానే కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారని దాని వెనక ఉన్నది సునీలేనంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఏ 1గా చేర్చారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిగిన తర్వాత అరెస్ట్కు సంబంధించిన అంశంపై మరోసారి కోర్టుకు వెళతామని సీసీఎస్ పోలీసులు స్పష్టం చేశారు.