దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో అనేక హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయలేకపోతే ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేయడం తగదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఉచిత హామీలు, సంక్షేమ పథకాలు రెండు విభిన్న అంశాలని స్పష్టం చేశారు. ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చని పార్టీల గుర్తింపును రద్దు చేయాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది. అది సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఉచిత పథకాలను ఇష్టానుసారంగా ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమవుతోన్న తరుణంలో సమగ్ర మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలా చేసే పార్టీల గుర్తులు, రిజిస్ట్రేషన్ను ఎన్నికల సంఘం రద్దు చేసేలా ఆదేశాలనివ్వాలని కోరారు. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ క్రిష్ణ మురారీల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉచిత పథకాల హామీలపై పూర్తి వివరాలను సమర్పించాలని రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఈ సమాచారం పూర్తిగా వచ్చిన తర్వాత, ఎంత వరకు జోక్యం చేసుకోచ్చునో పరిశీలిస్తామని చెప్పింది. తదుపరి విచారణ ఈ నెల 17న జరుగుతుందని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రాజకీయ పార్టీలు ఉచిత పథకాలపై ఇచ్చే హామీలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంలో సుప్రీం ముందడుగు వేసి, పార్లమెంటు ఓ చట్టాన్ని రూపొందించే వరకు అమలయ్యేలా మార్గదర్శకాలను జారీ చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఎన్నికల్లో ఉచిత హామీలను నియంత్రించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు.