తెలంగాణలో 10 సంవత్సరాలు పాటు పరిపాలన చేసిన .. కెసిఆర్ ప్రభుత్వం గద్దె దిగిపోయింది. ఈ పదేళ్ల కాలంలో జరిగిన పనులన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కెసిఆర్ హయాంలో ముఖ్యమంత్రి మాటే వేదంగా అధికారులు నడుచుకొన్నారు. దీంతో చట్టాలు, విధానాల్ని పక్కన పెట్టేసి పని చేసుకుంటూ పోయారు. ఇప్పుడే ఆ విషయాన్ని బయటకు తీస్తుంటే కళ్ళు చెదిరే అంశాలు వెలుగు చూస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల్ని తనిఖీ చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ సంచలన విషయాలు బయటపెట్టింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వము పెట్టిన ఖర్చులను తనిఖీ చేయడం.. రాజ్యాంగ బద్ధ సంస్థగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కార్యాలయం విధి. ఇందులో భాగంగా గత గులాబీ ప్రభుత్వం ఏ రకంగా డబ్బులు ఖర్చు పెట్టింది అనే విషయాన్ని ఒక నివేదిక రూపంలో కాగ్ బయటపెట్టింది. కాగ్ ఇచ్చిన సమాచారంలో కొన్ని సంచలన విషయాలు ఉన్నాయి.
నియమ నిబంధనలు పాటించకుండా రెండు లక్షల 86 వేల 811 కోట్లను దారి మళ్ళించారని కాగ్ లెక్క తేల్చింది. 2014-2022 వరకు ఎనిమిది సంవత్సరాల పరిపాలన మీద మదింపు చేసి ఈ నివేదిక వెల్లడించింది తర్వాత ఏడాదిన్నరకు సంబంధించిన పూర్తిస్థాయి లెక్కలు ఇంకా తేలలేదు.
ప్రతి రాష్ట్ర ప్రభుత్వము జమా ఖర్చులకు సంబంధించి బడ్జెట్ తయారుచేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. భారత రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఆమోదం పొందిన బడ్జెట్ ప్రకారమే డబ్బులు ఖర్చు పెట్టాలి. అత్యవసర పనులకు కొంతమేర డబ్బులు వాడుకునే వెసులుబాటు కల్పిస్తారు. ఒకవేళ బడ్జెట్ దాటి డబ్బులు ఖర్చుపెట్టినట్లయితే దానికోసం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనుమతి తీసుకోవాలి అసెంబ్లీలో కొందరు శాసనసభ్యులతో ఏర్పాటు అయినది పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన ఖర్చులు విషయాలు ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి తెలియజేసి అనుమతి తీసుకోవడం తప్పనిసరి.
కానీ కెసిఆర్ ప్రభుత్వం ఏనాడు ఆ పని చేయలేదని కాగ్ లెక్క తేల్చింది. కాలేశ్వరం ప్రాజెక్టు, మెట్రో స్కాము, ధరణి ప్రాజెక్టు, గొర్రెల కొనుగోలు వంటి అంశాల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారని కాకు ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒక్క కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలోని లక్ష కోట్ల దాకా డబ్బు … లెక్కా, పత్రం సరిగ్గా లేకుండానే బయటికి వెళ్లిపోయిందని అభిప్రాయబడింది. ముఖ్యమంత్రి కొందరు సీనియర్ మంత్రుల ఆదేశాలతో ఉన్నతాధికారులు నిబంధనలు పట్టించుకోకుండా కోట్లకు కోట్లు విడుదల చేశారని స్పష్టం చేసింది.
ఈ డబ్బులు విచ్చలవిడిగా వాడేయడం ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది. 2014 15 ఆర్థిక సంవత్సరంలో 303 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా, 2015 16 లో 580 కోట్ల ఖర్చు పెట్టారు. ఆ తర్వాత దూకుడు పెరిగింది.
2016-17 లో 21,161 కోట్లు
2017-18 లో 28,171 కోట్లు
2018-19 లో 29,173 కోట్లు
ఖర్చు పెట్టేశారు.
ఇక రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. నిబంధనలు పాటించకుండా, అసెంబ్లీ అనుమతి పొందకుండా డబ్బులు రిలీజ్ చేసుకుంటూ వెళ్లిపోయారు.
2019-20 లో 47,896 కోట్లు
2020-21 లో 81,514 కోట్లు,
2021-22 లో 75,053 కోట్లు
విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు.
దీనిని బట్టి ఈ ప్రవాహం ఎలా సాగిందో అర్థం అవుతుంది.
ప్రతి సంవత్సరం రెండు మూడుసార్లు సమావేశం పెట్టించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీని ఏమాత్రం పట్టించుకోలేదు. సరైన రీతిలో ఈ కమిటీ నుంచి అనుమతులు పొందలేదు అని కాగు రిపోర్టు చెబుతోంది. మొత్తం 10 ఏళ్ల కాలంలో ఐదు సార్లు మాత్రమే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ మొక్కుబడిగా సమావేశం అయిందని లెక్క తేల్చింది.
వాస్తవానికి ఈ నివేదిక ఫిబ్రవరిలోనే విడుదలైనట్లుగా తెలుస్తోంది. కానీ ఈ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ నివేదిక మీద రాజకీయ దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.