258 కోట్ల నగదు, 25 కిలోల బంగారం, 250 కిలోల వెండి దేశవ్యాప్తంగా ఖరీదైన ఇళ్లు, స్థలాలు…పలు దేశాల్లో స్తిరాస్తులు…ఇవీ కాన్పూర్ పెర్ ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ ఆస్తులు. ఐదురోజుల పాటు ఐటీ అధికారులు సాగించిన సోదాల్లో ఇవన్నీ బయటపడ్డాయి.
ఈ ఆర్థిక నేరగాడు కూడబెట్టిన అక్రమ ఆస్తుల వ్యవహారం రాజకీయ ప్రకంపనలూ సృష్టిస్తోంది. ఎందుకంటే ఇతగాడు యూపీ మాజీ సీఎం, సీఎం కుర్చీనే లక్ష్యంగా మరోసారి ఎన్నికల్లో తలపడబోతున్న అఖిలేష్ యాదవ్ ముఖ్య అనుచరుడు.
ఆదాయ పన్ను ఎగవేశాడనే ఆరోపణలతో ఈనెల 22న జైన్ ఇంట్లోనూ, కనౌజ్ లోని ఆయన ఫ్యాక్టరీలోనూ ఐటీ, జీఎస్టీ అధికారులు సోదాలు చేశారు. బయటపడిన అంతులేని ఆస్తులు చూసి అధికారులు నివ్వెరపోయారు. నగదు, బంగారంతో పాటు…దేశవ్యాప్తంగా…విదేశాల్లోనూ కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని గుర్తించారు. వాటితో పాటు పర్ఫ్యూమ్ తయారీకి వాడే 600 కిలోల గంధపు నూనెనూ గుర్తించారు. దాని విలువే ఆరుకోట్లు.
ఎన్నికల ముంగిట బయటపడిన ఈ ఆర్థిక నేరస్తుడి వ్యవహారం యూపీలో కలకలం రేపుతోంది. అతను అఖిలేష్ అనుచరుడు కావడమే అందుకు కారణం. వందల కోట్ల అక్రమాస్తుల్ని రికవరీ చేసిన అధికారులు వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై దర్యాప్తు మొదలు పెట్టారు.
ఇక యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పీయూష్ నేరాల్ని ప్రస్తావిస్తూ ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు.
కాన్పూర్లో మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా… ఎస్పీ పైనా, పార్టీ చీఫ్ అఖిలేశ్ పైనా సెటైర్లు వేశారు. తాము అభివృద్ధి చేస్తే బీజేపీ క్రెడిట్ తీసుకుంటోందని మమ్మల్ని అంటారు కదా…ఇప్పుడు నోట్ల కట్టలు బయటపడ్డాయి. మరి ఇప్పుడు ముందుకు రావడం లేదేందుకు…2017కి ముందు దాకా అత్తరు అవినీతి, యూపీలో ఎలా గుభాలించిందో అందరికీ తెలిసిందేనని ప్రధాని వ్యాఖ్యానించారు.
అయితే ప్రధాని పరోక్షంగా విమర్శలు గుప్పిస్తే అమిత్ షా అయితే నేరుగా పేరు ప్రస్తావించారు. ఎస్పీకి చెందిన పర్ఫ్యూమ్ వ్యాపారి అడ్డంగా దొరికాడు. అన్ని కోట్లు ఎక్కడివి అఖిలేశ్ గారూ అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు.
అయితే పీఎం, హోంమంత్రి ఆరోపణలని అఖిలేశ్ పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ… బీజేపీ పొరపాటున తమ వాళ్లపైనే దాడులు చేయించిందంటూ కౌంటర్ వేశారు.
ఇక పాత స్కూటర్ పై తిరిగే పీయూష్ కు వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. జైన్ తో దాడులు ఆగబోవని…ఇతర బడా వ్యాపార వేత్తలపై కూడా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగించవచ్చనీ తెలుస్తోంది. 40కి పైగా నకిలీ కంపెనీలకు యజమానిగా ఉన్న పీయూష్ విచారణలో మరిన్ని నిజాలు వెలుగుచూడవచ్చు.
50 గంటలపాటు పీయూష్ ను విచారించి అరెస్ట్ చేశారు. మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.